education లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
education లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2021, శుక్రవారం

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి


పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయితే అతనికి వృధాప్యం రావడం వల్ల అతను వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేకపోతాడు. పరమభక్తుడైన ద్వారకుడి ఇబ్బందిని గ్రహించిన వేంకటేశ్వరుడు అతను నివాసం ఉంటున్న ప్రదేశంలో విగ్రహ రూపంలో వెలుస్తారు. అలా వేంకటేశ్వర స్వామి వారు ద్వారకుడి వలన ఇక్కడ వెలిశారని ఆయన గుర్తుగా ఈ ప్రదేశాన్ని ద్వారకా తిరుమల అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. పెద్ద తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్న వారు చిన్న తిరుపతిలో ఆ మొక్కును చెల్లిస్తే వారికి పెద్ద తిరుపతిలో మొక్కు చెల్లించిన ఫలితం లభిస్తుంది అని అంటారు. కాని చిన్న తిరుపతిలో  మొక్కిన మొక్కు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని అక్కడి జనం అంటుంటారు.


ఈ వేంకటేశ్వరుని దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలోని మండలం మరియు గ్రామం అయిన ద్వారకా తిరుమలలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం ఏలూరుకు 42 కిలోమీటర్ల దూరంలోను, భీమడోలుకు 15 కిలోమీటర్ల దూరంలో కొలువై వుంది. ప్రస్తుతం ఉన్న గుడి,  మండపము, గోపురము, ప్రాకారాలను నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు గారు కట్టించారు. బంగారు ఆభరణాలు,వెండి వాహనాలను రాణి చిన్నమ్మ రావు స్వామి వారికి సమర్పించారు. ఈ గ్రామం పశ్చిమాన స్వామి వారి పుష్కరిణి ఉంటుంది. దీనిని సుదర్శన పుష్కరిణి, కుమార తీర్థమని  అంటారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవంను కన్నుల పండుగగా జరుపుతారు. 

వేంకటేశ్వర స్వామి ఒక సందర్భంలో ఆశ్రమంలో ఉండవలసి వస్తుంది. ఆ సమయంలో వేంకటేశ్వర స్వామికి ఆకలి వేస్తే అప్పుడు అక్కడికి వచ్చిన ఆవు యొక్క పాలను త్రాగుతాడు. అది చుసిన ఆ ఆవు యొక్క యజమాని కోపంతో వేంకటేశ్వరుని తలపై కర్రతో గట్టిగా కొడతాడు. అప్పుడు వేంకటేశ్వరుని తలపై చిన్న గాయం అవ్వడమే కాకుండా జుట్టు కూడా కొంచెం ఊడిపోతుంది. అయితే కలియుగ దైవం  అయిన వేంకటేశ్వర స్వామిని జుట్టు లేకుండా చుసిన గాంధర్వ కన్యా రాకుమారి అయిన నీలాదేవి తన కొప్పులో నుండి కొన్ని వెంట్రుకలను తీసి స్వామి వారి తలపై అలంకరిస్తుంది. అప్పటి నుండి స్వామివారిని దర్శించుకున్న భక్తులు నీలాదేవిని గౌరవిస్తూ తమ నీలాలను స్వామి వారి గుడి ప్రాంగణంలో ఉన్న కళ్యాణ కట్టలో సమర్పిస్తారు. 

ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు కొండ పైన ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయం మరియు వేంకటేశ్వరుని మందిరానికి వెళ్లే మార్గమధ్యంలో ఉన్న కుంకుళ్ళమ్మ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ పుణ్యస్థలానికి వచ్చిన వారు ఈ మందిరాలను కూడా దర్శించుకుని వెళ్తారు. అంతే కాకుండా కొండ పైన ఉన్న గోశాలలోని గోవులు, మరియు గజరాజులు మనకు కనుల విందు కలిగిస్తాయి. 

స్వామి వారి దేవస్థానము ఆధ్వర్యంలో ఉన్న పద్మావతి వసతి గృహం, ఆండాళ్ అతిధి గృహం, సీత నిలయం, టీటీడీ అతిధి గృహాలు మనకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మీరు  ఏ సమయంలో వచ్చిన ఇక్కడ బస చేయవచ్చు. అంతేకాకుండా ప్రతి రోజు నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చిన భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయితే దీనికోసం  భక్తులు ముందుగానే టిక్కెట్ కౌంటర్ వద్ద టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్వామి వారి లడ్డు ప్రసాదం కోసం కూడా ముందుగానే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భక్తులు ఈ లడ్డు కోసం డబ్బు చెల్లించవలసి ఉంటుంది.  

విజయవాడ నుండి ద్వారకా తిరుమలకు 98 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 72 కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం నుండి 47 కిలోమీటర్లు, భీమడోలు నుండి 17 కిలోమీటర్లు దూరం ఉంటుంది. 

5, జనవరి 2021, మంగళవారం

తులసి మన ఇంట ఆరోగ్యం మన వెంట.

తులసి  చెట్టు


హిందువుల ఆరాధ్య దైవాలలో ఒకరైన విష్ణువుకు ప్రీతిపాత్రమైన చెట్టు తులసి చెట్టు. తెలుగింటి ఆడపడుచులు తులసి చెట్టును తమ దైవంగా ప్రార్థిస్తారు. తులసి ఆకుల తీర్దాన్ని ప్రతి గుడిలోనూ భక్తులకు అందిస్తారు. తులసి చెట్టు సర్వరోగ నివారిణిగా మనకు ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ఉన్న ఇంటిలో త్రిమూర్తులు కొలువుంటారని ప్రతీతి. అంతేకాకూండా 2000 సంవత్సరాల ఆయుర్వేద వైద్యంలో తులసి చెట్టు ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా ఔషధాల
తయారీలోను ఈ తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ప్రాణవాయువును విడుదల చేస్తుంది. హిందువుల ముఖ్య పండుగలలో తులసి ఆకులను పూజ చేయడానికి ఉపయోగిస్తారు.


ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మాత పూజను హిందువులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఆ రోజు తులసి చెట్టు చుట్టూ పందిరి వేసి ఆ పందిరిని మావిడాకులతో అలంకరించి,
బాణాసంచా కాలుస్తూ నిష్ఠగా ఆ పూజను ఆచరిస్తారు. ఉదయాన్నే తులసి చెట్టును దర్శించడం ద్వారా పాపాలు నశిస్తాయి. తులసి చెట్టు ఉన్న చోట దుష్టశక్తులు దరిచేరవు. హిందువుల ఆచార సాంప్రదాయాలలో తులసి చెట్టును విశిష్టంగా వాడతారు. యేసుక్రీస్తును శిలువ వేసిన చోట తులసి చెట్టు మొలచిందని అంటుంటారు.

తులసి చెట్టు యొక్క ఉపయోగాలు :


1) తులసి ఆకులు తినడం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. 
2) తులసి ఆకుల రసాన్ని డెంగ్యూ, మలేరియా జ్వరం లాంటి రోగాలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. 
3) తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగడం ద్వారా గొంతు గరగరను తగ్గించుకోవచ్చు. 
4) ప్రతి రోజు 5 తులసి ఆకులను ధనియాలు,మిరియాలతో కలిపి మిశ్రమంగా చేసుకుని తింటే పొట్టలోని నులి పురుగులు నశిస్తాయి. 
5) రెండు స్పూన్ల తులసి ఆకుల రసాన్ని తేనె కలుపుకుని తాగడం వల్ల పైత్యం తగ్గుతుంది. 
6) తులసి ఆకులను నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. 
7) తులసి ఆకులు తినడం వల్ల చెడు శ్వాస తగ్గుతుంది,
8) తులసి ఆకులను మజ్జిగలో వేసుకుని తాగితే బరువు తగ్గుతుంది. 
9) తులసి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
10) తులసి ఆకులను తీసుకుంటే మూత్రపిండాలు శుభ్రమవుతాయి. 
11) తులసి ఆకులు తింటే గుండెకు రక్త సరఫరా సక్రమంగా అయ్యేలా చేస్తాయి. 
12) ఎన్నో రకాల ఔషధగుణాలు ఉన్న తులసి ఆకులను తిందాం, ఆరోగ్యంగా ఉందాం.  

2, జనవరి 2021, శనివారం

ప్రొద్దున్నే ఒక గ్లాస్ వాటర్ చేస్తుంది మీ ఆరోగ్యాన్ని పారాహుషార్.

మంచి నీళ్లు తాగండి ఆరోగ్యంగా ఉండండి.


మంచి నీళ్లు ఇది మన ముందు ఉన్న దివ్య ఔషధం. మనిషి శరీరం 60 నుండి 70 శాతం నీటితో తయారు చేయబడి  ఉంటుంది. మనం ఉదయం లేవగానే రెండు గ్లాసుల వాటర్ తాగడం ద్వారా మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడంతో పాటు మన రోజూవారి కార్యక్రమాల్లో చాలా ఆరోగ్యంగాను,ఉత్సహాంగాను పాల్గొనగల్గుతాం. అంతేకాకుండా మనం ఈ మంచినీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా పలు రకాల ఆరోగ్య సమస్యలకు దూరం కావొచ్చు.     



ఉదయం లేవగానే మొదటగా మనం గోరువెచ్చని మంచి నీళ్ళని రెండు గ్లాసులు తీసుకోవాలి. ఒక వేళ మీకు అలా తాగడం కుదరక పోతే ఒక బాటిల్ నిండా మంచి నీళ్ళని పట్టుకుని కొంచెం కొంచెంగా తాగండి,ఉదయాన్నేఇలా చేయడం ద్వారా మన శరీరంలో పోషకాలు పెరగడమే కాకుండా శరీరంలోని మలినాలు  శుభ్రం అవుతాయి. ప్రధానంగా మనం ఈ మంచి నీళ్లు తాగిన 30 నిమిషాల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుకోవచ్చు. 

ఉదయాన్నే మంచి నీళ్లు తాగడం ద్వారా శరీరం శుభ్రం అవడమే కాకుండా మన ఊపిరితిత్తుల పని తీరును మెరుగు పడుతుంది. ఒక టీస్పూన్ మెంతులు గ్లాస్ వాటర్లో కలుపుకుని తాగడం ద్వారా రక్తపోటు,మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడంకోసం కూడా ఈ మెంతుల వాటర్ ఉపయోగపడుతుంది.

మన శరీరానికే కాకుండా చర్మసౌందర్యానికి కూడా మనం త్రాగే మంచి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటర్ మన శరీరాన్ని హైడ్రేట్ చేయడం ద్వారా చర్మం మరింత ప్రకాశవంతంగా వెలిగేలా చేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఈ మంచి నీళ్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా శరీరాన్ని తగ్గించుకోవడానికి ఈ వాటర్ ఎంతగానో ఉపయోగపడతాయి.
రోజుకు 8 గ్లాసుల వాటర్ తాగడం ద్వారా మన శరీర జీర్ణవ్యవస్థను చక్కదిద్దుకోవడమే కాకుండా తొందరగా బరువు తగ్గొచ్చు.

కాబట్టి మంచి నీళ్లను నిర్లక్ష్యం చేయకుండా తాగుదాం రోగాలకు దూరంగా ఉందాం.

27, డిసెంబర్ 2020, ఆదివారం

తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న సినిమా తెలుగు సినిమా.

తెలుగు సినీ పరిశ్రమ (TFI)


ప్రపంచ పటంలో ఎక్కడో మారుమూల చిన్న పరిశ్రమ. కాని ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ సినిమాలను రూపొందిస్తోంది ఈ పరిశ్రమ. భారత దేశ సినిమా ఖ్యాతిని నలుదిశలకు ప్రసరింప చేస్తూ బలంగా నిలబడింది ఈ పరిశ్రమ. అంతేకాకుండా యువతరానికి నేనున్నాను అన్న భరోసాను కలిగిస్తుంది ఈ పరిశ్రమ. ఎంతో మంది యువ నటీనటులకు,నిర్మాతలకు,దర్శకులకు అవకాశం కల్పిస్తోంది ఈ సినీ పరిశ్రమ. అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించేలా చేస్తుంది ఈ పరిశ్రమ. ఎంతోమంది పేద కార్మికులకు అన్నం పెడుతుంది ఈ పరిశ్రమ. దాన వీర సూర కర్ణ,అల్లూరి సీతారామరాజు,మేజర్ చంద్రకాంత్,శివ,సమర సింహ రెడ్డి,ఠాగూర్,పోకిరి,గబ్బర్ సింగ్ మరియు ఈగ,బాహుబలి,బహుబలి 2 లాంటి చిత్రాలతో చరిత్ర సృష్టించిన పరిశ్రమ. 2013 లో భారతదేశానికి సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో 17 శాతం వాటాను కలిగి ఉన్న పరిశ్రమ. అంతే కాకుండా భారతదేశంలో ఎక్కువ ప్రేక్షకాదరణ ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు ధీటుగా నిలుస్తూ విజయవంతంగా ముందుకు నడుస్తున్న మనందరి పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ తెలుగు చిత్ర పరిశ్రమను టాలీవుడ్ అని పిలుస్తారు. 


తెలుగు సినిమాలకు పితృ సమానుడిగా రఘపతి వెంకయ్య నాయుడు గారిని కొలుస్తారు. ఈయన 20వ శతాబ్దం మొదట్లో సొంతంగా సినిమాలను తీస్తూ తెలుగు సినిమాలను గురించి తెలియ చేయడానికి ప్రపంచమంతా పర్యటించేవారు. అయితే మొదట్లో అన్ని మూగ సినిమాలు తీసేవారు. హెచ్.ఎమ్.రెడ్డి అనే వ్యక్తి మొదటి తెలుగు-తమిళ్ మోషన్ పిక్చర్ అయిన కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన తెలుగులో మంచి విజయం సాధించిన భక్త ప్రహళ్లాద సినిమాకు దర్శకుడు. సి.ఎన్.ఎన్ ఛానల్ ప్రకటించిన 100 భారతదేశ అద్భుత చిత్రాలలో పాతాళ భైరవి,మల్లీశ్వరి,దేవదాసు,మాయాబజార్,నర్తనశాల మరియు మరోచరిత్ర,మా భూమి,సాగర సంగమం,శంకరాభరణం,శివ సినిమాలు నిలిచాయి. 2017 లో విడుదలైన బాహుబలి2 సినిమా భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. 2018-2019 సంవత్సరాలలో భారతదేశంలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన పరిశ్రమలలో బాలీవుడ్ తర్వాతి స్థానంలో టాలీవుడ్ నిలిచింది. 

20వ శతాబ్దంలో నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు,ఘట్టమనేని కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు,మురళీ మోహన్ లాంటి హీరోల చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించేవి.  

మొదట్లో బ్లాక్ అండ్ వైట్ 35mm సినిమాలు సినిమా థియేటర్లలో విడుదల చేసేవారు. మొదటి తెలుగు సినిమా స్కోప్ చిత్రాన్ని హీరో  కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంతో మన ముందుకు తీసుకొచ్చారు. అంతే కాకుండా మొదటి 75 mm చిత్రాన్ని సింహాసనం చిత్రం ద్వారా హీరో కృష్ణ మన ముందుకు తీసుకు వచ్చారు.అంతేకాకుండా మొదటి డి.టి.ఎస్ చిత్రాన్ని తెలుగు వీర లేవరా సినిమా ద్వారా హీరో కృష్ణ మనకు పరిచయం చేసారు. 

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్,గీత ఆర్ట్స్,వైజయంతి మూవీస్,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,ఆర్కా మీడియా,మైత్రి మూవీస్,యూవీ క్రియేషన్స్,14 రీల్స్ లాంటి సంస్థలు పెద్ద చిత్రాలను నిర్మిస్తున్నాయి. 

చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి హీరోల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తున్నాయి. 

అనుష్క శెట్టి,కాజల్ అగర్వాల్,సమంత,తమన్నా,నయనతార,రష్మిక మందాన,నభా నటాషా,కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అగ్రతారలుగా వెలుగొందుతున్నారు.  
 

18, డిసెంబర్ 2020, శుక్రవారం

ఎనిమిది మెదడులు, మూడు గుండెలు, నీలి రక్తం కలిగిన జీవి.

సముద్రపు జీవి ఆక్టోపస్


సముద్రపు అడుగున ఉంటూ ఎన్నో జీవరాశులను తన చేతులతో పట్టి తినే ప్రమాదకరమైన జీవరాశి ఆక్టోపస్. ఈ ఆక్టోపస్ మూడు గుండెలు, తొమ్మిది మెదడులను కలిగి ఉంటుంది, మరియు దీని యొక్క రక్తం నీలి రంగులో ఉంటుంది. ఆక్టోపస్ యొక్క తొమ్మిది మెదడులలో ఒకటి న్యూరాన్లతో ముడిపడి ఉంటుంది. మరియు మిగతా ఎనిమిది మెదడులు ఎనిమిది చేతులతో అనుసంధానం అయ్యి ఉంటాయి. ఇది శరీరంలో ఎటువంటి ఎముకలు లేని జీవి. ఈ జీవి  ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని తింటుంది. అంతే కాకుండా ఇది సముద్రపు 
జీవరాసులలో తెలివైన జీవరాశిగా పేరు గడించింది. 


ఆక్టోపస్, ఆక్టోపోడా అనే జాతికి చెందిన జీవి. ఈ ఆక్టోపోడా జాతిలో ఇంకా ఇదే తరహాలో 300 జీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆక్టోపస్ అనే పదం గ్రీకు భాష నుండి పుట్టింది. గ్రీకు భాషలో ఆక్టోపస్ అంటే ఎనిమిది అడుగులు అని అర్ధం. ఒక మ్యాగజిన్ వారు ఆక్టోపస్ ను "సముద్రంలో అత్యంత రహస్యమైన జీవిగా పరిగణించారు". ఆక్టోపస్ జాతిలో పసిఫిక్ ఆక్టోపస్ అతిపెద్ద ఆక్టోపస్ గా పేర్కొనబడుతుంది. సాధారణంగా పెద్ద ఆక్టోపస్ బరువు పదిహేను కేజీలు ఉంటుంది. వీటిలోని అతిపెద్ద ఆక్టోపస్ యొక్క బరువు సుమారు 71 కేజీల వరకు ఉంటుంది. ఈ ఆక్టోపస్ కు ఎముకలు లేకపోవడం వల్ల ఇది దీని చేతులను ఎటువైపు కావాలంటే అటువైపు తిప్పగలదు. అంతేకాకుండా ఏ దిశలోనైనా వొంగగలుగుతుంది. దీని చర్మం బాహ్యకణాలు, ఇంద్రియ కణాలతో నిండి ఉంటుంది. 

ఆక్టోపస్ కు మూడు గుండెలు ఉంటాయి. ఒక గుండె రక్తాన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. మరియు మిగతా రెండు గుండెలు మొప్పలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. దీని యొక్క రక్తం నీలి రంగులో ఉండడానికి కారణం హేమోసైనిన్ అనే రాగి ఆధారిత ప్రోటీన్ దీని శరీరంలో ఉండడం. ఆక్టోపస్ ఈత కొట్టినప్పుడు రక్తాన్ని సరఫరా చేసే అవయవం కొట్టుకోవడం ఆగిపోతుంది. అందుకే ఇవి ఈత కొట్టడం కంటే నెమ్మదిగా అటు ఇటు వెళ్ళడానికి ఇష్టపడతాయి. ఆక్టోపస్ లు ప్రపంచ మహా సముద్రాలలో నివసిస్తాయి. ఇవి సముద్రంలోని దిబ్బలు,పగుళ్లలో నివసిస్తాయి. కొన్ని ఆక్టోపస్ సముద్రపు గుహలలో నివసిస్తాయి. 

ఆక్టోపస్ లు ఏకాంతంగా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు  ఇతర ఆక్టోపస్ లతో  కలుస్తాయి. సాధారణంగా ఆక్టోపస్ లు రాత్రిపూట ఆహారం కోసం వేటాడతాయి. కొన్ని సాయంత్రం, మరికొన్ని వేకువజామున వేటాడతాయి. పగటిపూట ఇవి వేటాడవు. 

జీవరాసులు ఏవైనా దీనిపై దాడి చేయడానికి వస్తే ఇది ముందుగానే పసిగడుతుంది. ఆ సమయంలో ఇది ఆ జీవరాశిపై సిరా అనే ద్రావణాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రావణం తాత్కాలికంగా అంధకారున్ని చేయడమే కాకుండా గందరగోళానికి గురిచేస్తుంది. ఒకొక్క సారి ఈ సిరా వల్ల రుచి మరియు వాసన కూడా మందగిస్తుంది. 

ఆక్టోపస్ సహజంగా మాంసాహారి . ఇది ఎక్కువగా చేపలు, సొర చేపలు, ఎండ్రకాయలు, రొయ్యలు  తింటుంది. ఆక్టోపస్ ముందుగా తన శరీరంతో పూర్తిగా తను తినే ఆహారంపై పడుతుంది, అక్కడి నుండి మెల్లగా నోటిలో వేసుకుని తింటుంది. 

15, డిసెంబర్ 2020, మంగళవారం

కోసినప్పుడు కన్నీళ్లు పెట్టించినా తిన్నప్పుడు మాత్రం దీని రుచితో ఔరా అనిపిస్తుంది.

కూరగాయాలకు రారాజు ఉల్లిపాయ


ఎటువంటి వంటలోనైనా ఇది లేకుంటే ఆ వంటకు రుచే వుండదు. ప్రొద్దుటే చేసుకునే టిఫిన్ నుండి సాయంత్రం భోజనం వరకు ఇది లేకుంటే చాలా కష్టం. కూర ఏదైనా సరే దాని రుచిని పెంచడానికి దీనిని వాడవలసిందే. భోజనప్రియులను అకట్టుకోవడానికి దీనిని మన వంటలలో వాడాల్సిందే. ఎన్నో పోషక విలువలు కలిగియున్న ఎంతోమందితో ఔరా అనిపించుకున్న మన వంటింటి నేస్తం ఉల్లిపాయ. 
   

ఉల్లిపాయ యొక్క శాస్త్రీయ నామం ఆలియం సీపా, మరియు ఇది ఆలియేసి కుటుంబంలో ఆలియం ప్రజాతికి చెందినది. ఉల్లిపాయను తెలుగులో ఉల్లిగడ్డ అని కూడా అంటారు. ఉల్లిపాయను ఇంగ్లీషులో ఆనియన్ అని పిలుస్తారు. ఈ ఉల్లిపాయను ఎక్కువగా ప్రతిరోజు వండుకునే వంటలలోను, విందు భోజనాలలోను ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ ఉల్లిపాయలు తెల్ల, ఎర్ర రంగులలో ఉంటాయి. మరియు చిన్న, పెద్ద ఆకారాలలో లభిస్తాయి. అంతేకాకుండా ఎక్కువ వాసన, తక్కువ వాసన మరియు తియ్యగా ఉన్న ఉల్లిపాయలు కూడా మనకు లభిస్తాయి.

ఉల్లిపాయకు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉల్లిపాయ భారతదేశంలో పుట్టింది అని కొందరు అంటే, ఇంకొంత మంది పాకిస్తాన్ లో పుట్టింది అని అంటారు. అయితే మొదట్లో ఆసియా లో మాత్రమే పండే ఈ పంటను ప్రస్తుతం ప్రపంచ నలుమూలలా పండిస్తున్నారు. ఉల్లిలో క్యాలరీ శక్తి ఎక్కువ, వేయిస్తే ఈ శక్తి ఇంకా పెరుగుతుంది. ఉల్లిలో గంధకం పాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని కోసేటప్పుడు కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. అంతేకాకుండా ఉల్లిని ఎక్కువగా తినడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ఉల్లిపాయలతో చేసే కూర చాలా మంచి రుచిని కలిగిఉంటుంది. అంతే కాకుండా ఉల్లిపాయల రసాన్ని తలపై రాయడం ద్వారా జుట్టు ఎదుగుదలను పెంచుకోవచ్చు.  


ఉల్లిపాయల నుండి వచ్చే ఉల్లికాడలు ఎన్నో పోషకవిలువలు కలిగి ఉంటాయి. ఉల్లికాడలను వేడి నీళ్లలో మగ్గించడం ద్వారా వచ్చే రసం మన జీర్ణ వ్యవస్థ ప్రక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు తినని వాళ్ళు ఉల్లికాడలను వారి వంటలలో వినియోగించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఉల్లి కాడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉల్లి కాడలలో విటమిన్ సి, బీటాకెరెటిన్ లు ఉంటాయి ఇవి మన కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడతాయి. గర్భిణీ స్త్రీలు వీటిని తినడం ద్వారా పుట్టబోయే బిడ్డకు వెన్నుముక సమస్యలు తలెత్తకుండా చేయగలుగుతారు. 

28, నవంబర్ 2020, శనివారం

వాట్సాప్,ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపారాలు చేస్తూ విజయం అందుకుంటున్న నేటితరం మహిళలు.

ఆన్ లైన్ వ్యాపారాలలో మహిళా శక్తి


వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలను ఛాటింగ్ చేయడం కోసం, వీడియోస్,  ఫొటోస్ షేర్ చేయడం కోసం మాత్రమే ఈనాటి యువతరం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇటువంటి సామాజిక మాధ్యమాలను ఛాటింగ్ కోసమే కాదు వ్యాపారం చెయ్యడం కోసం ఉపయోగించవచ్చు, గొప్పగా డబ్బులు సంపాదించవచ్చు అని కొంతమంది మహిళలు నిరూపిస్తున్నారు. అలా వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లను ఉపయోగించి వ్యాపారం చేస్తూ ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఈ  మహిళ పేరు  ప్రియాంక శర్మ. ఈమె 90,000 రూపాయల అతి తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టి ఈ రోజు లక్షలలో ఆదాయాన్ని సంపాదిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలిచింది. 


ప్రియాంక శర్మ ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో మాస్టర్స్ అండ్ జర్నలిజం కోర్సులో మాస్టర్ డిగ్రీ అందుకుంది. అయితే ప్రియాంకకు మొదటి నుండి ఫ్యాన్సీ ఐటమ్స్, గోడగడియారాలు, చిన్న చిన్న కళాకృతులు తయారు చేయడంపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే స్ట్రింగ్ నేమ్ ప్లేట్స్, డోర్ హ్యాంగింగ్స్, చెక్కిన బోర్డులు, చెక్క బహుమతులు తయారుచేసేది. అయితే ఒకరోజు ప్రియాంక తను చేసిన వస్తువులను అమ్ముదాం అని తన సోదరి అయిన అంజలితో చెపుతుంది. ఆ మాటలు విన్న ఆమె సోదరి అందుకు అంగీకరిస్తుంది. అలా హారన్ ఓకే ప్లీజ్ అనే పేరుతో ఢిల్లీలో జరిగే ఉత్సవ మేళాలలో తాము చేసిన వస్తువులను అమ్మడం మొదలు పెడతారు. అలా తమ వ్యాపారంలో మొదటి అడుగు వేస్తారు. అయితే ఈ వ్యాపారం చక్కటి విజయం సాధించడంతో తమ వస్తువులను ఆన్ లైన్ లో అమ్మాలని నిర్ణయించుకుంటారు.

 

అలా ఆగస్ట్, 2019వ సంవత్సరంలో  డూడుల్ హట్స్ డిజైన్స్ అనే పేరుతో తమ వస్తువులను ఆన్ లైన్ లో అమ్మడం మొదలు పెడతారు. అందుకోసం వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారు. వీరు అమ్మే వస్తువులు 299 రూపాయల నుండి 3500 రూపాయల వరకు ఉంటాయి. అంతేకాకుండా వీరు తమకు వచ్చిన ఆర్డర్స్ ని భారతదేశంలోని ఏ ప్రాంతంకైనా 4 నుండి 7 రోజులలో డెలివరీ చేస్తారు. 90,000 రూపాయల పెట్టుబడితో మొదలైన ఈ వ్యాపారం అతి తక్కువ రోజులలోనే 3 ఇంతలు ఆదాయాన్ని సంపాదించింది. అంతేకాకుండా వీరు వస్తువులను పోస్ట్ చేసిన 2 గంటలలోనే మొత్తం అమ్ముడైపోతున్నాయి అని ప్రియాంక చెపుతున్నారు.  
 

వ్యాపారం కొంచెం కొంచెం అభివృద్ధి చెందడంతో ఆన్ లైన్ లో ఆర్డర్స్ కూడా పెరిగాయి. ఒకేసారి ఆర్డర్స్ పెరగడం వల్ల ప్యాకింగ్ చేయడం కష్టమయ్యేది. అందుకోసం 8 మంది మహిళా ఉద్యోగులను నియమించుకున్నారు. అలా వారు నియమించుకున్న ఉద్యోగులు  ప్యాకింగ్, ఫాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేసేవారు. అయితే వీరికి ముందుగానే 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగంలో నియమించుకున్నారు. కోవిడ్ -19 లాక్ డౌన్ లో ఆన్ లైన్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరిగిందని తమ వస్తువులు బాగా అమ్ముడుపోయాయని ఆమె అంటున్నారు. 

కళలు మరియు చేతి ఉత్పత్తులు ఆన్ లైన్ లో కొత్త వ్యాపారం కానప్పటికి, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా తాము విజయం సాధించాం అని ఆమె చెబుతున్నారు. అంతేకాకుండా ఇ-కామర్స్ వ్యాపారం ముందు ముందు రోజుల్లో మరింతగా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆమె అన్నారు. 

27, నవంబర్ 2020, శుక్రవారం

విజయం అనేది పనిచేసే వారి జీవితంలోకి సర్వసాధారణంగా వస్తుంది.

విజయానికి సంకేతం గెలుపా


పొద్దున్న 7 గంటలకు లేస్తాం హడావిడి హడావిడిగా మన రోజువారీ పనులకు బయలుదేరతామ్. సాయంత్రం పని అయ్యాక ఇంటికి వస్తాం భోజనం చేసి కొంతసేపు టీవీ చూసి పడుకుండిపోతాం. మళ్ళీ తర్వాత రోజు ఉదయం లెగుస్తామ్ మళ్ళీ మన రోజువారీ కార్యక్రమాలలో పాల్గొంటాం. ఇంక వీకెండ్ హాలిడేస్ లో నిద్రపోవడం, సినిమాలు చూడడం, టైం పాస్ చేయడం. ఇంక వీకెండ్ హాలిడే అయిపోయిందంటే ఆ తర్వాత మళ్ళీ  అంత మాములే. ఇలానే జీవితం గడుస్తూ ఉంటే కొన్ని రోజులకు మనకు ఈ జీవితం ఏంట్రా బాబు అసలు ఎమ్ జరుగుతుంది అన్న ఆలోచన, దాని నుండి బాధ, జీవితం ఇంక అయిపోయింది రా బాబు అన్న నిరాశ కలగడం మొదలువుతుంది. కొంత మంది సున్నితమనస్కులు తమ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు.


మనం పైన మాట్లాడుకున్న విషయాలలో ఏవి కూడా మనం అనుకున్నట్టుగా జరగట్లేదు కాబట్టి మనకు నిరాశ, నిస్పృహ కలుగుతున్నాయి. కాని మనం ఎప్పుడైనా ఇది కావాలి అని దానికోసం వెళ్తామా లేదు, అందరిలాగానే స్కూల్ లో చదువుతాం, ఆ తర్వాత కాలేజీలో చదువు, గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత మంచి జాబ్ కోసం ప్రయత్నం. జాబ్ లో జాయిన్ అయ్యి డబ్బు సంపాదించడం మొదలు పెడతాం. కొన్ని రోజులకు పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత పిల్లల్ని కంటాం . వాళ్ళ చదువు కోసం వాళ్ళ జీవితం కోసం వాళ్ళ మంచి భవిషత్తు కోసం కష్టపడతాం కొన్ని సంవత్సరాలకు ముసలి వాళ్ళం అవుతాం తర్వాత చనిపోతాం.

 

కాని ఒక్క విషయం మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అది ఏమిటంటే మనం ఏమి చేసిన చెయ్యకపోయినా కాలం అనేది మాత్రం ఎవరికోసం ఆగదు. కాబట్టి అందరిలాగా కాకుండా ఏదైనా కొత్తగా, చరిత్రలో నిలిచిపోయే పనిని చేయడానికి ప్రయత్నిద్దాం. మనకంటూ చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చూసుకుందాం. మనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుందాం. ఎంతటి కష్టం వచ్చిన వెనకడుగు వేయకుండా పట్టుదలగా ముందుకు సాగుదాం, మన చివరి నిమిషం వరకు పని చేస్తూనే ఉందాం మనం అనుకున్న దాన్ని సాధించుకుందాం. ఎందుకంటే బిల్ గేట్స్ అనిపించుకోవడం చాలా కష్టం. కాని బికారి అనిపించుకోవడం చాలా సులువు. 

26, నవంబర్ 2020, గురువారం

ఒక సంస్థ యొక్క బ్రాండ్ అనేది ఒక వ్యక్తి యొక్క ఖ్యాతి లాంటిది. కఠినమైన పనులను చక్కగా చేయడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఖ్యాతిని సంపాదిస్తారు.

జెఫ్ బెజోస్


డబ్బు సంపాదించాలి, అందరిలోను గొప్ప పేరు పొందాలి అని ఎంతో మంది ఆశ పడతారు. కాని ఆ అవకాశం కొంత మందికి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే డబ్బు సంపాదించడం అంత సులువైన విషయం కాదు కాబట్టి. తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనలో ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వెనుదిరిగి చూడకుండా తనపై తనకున్న నమ్మకంతో, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తుల వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇంటర్నెట్, ప్రపంచానికి కొంచెం కొంచెంగా పరిచయమవుతున్న సమయంలో ఆన్ లైన్ లో వస్తువులు అమ్మడం ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు అని ఒక వ్యక్తి నమ్మి పెద్ద కంపెనీలో జాబ్ ని వదిలేసి వచ్చి సొంతంగా వ్యాపారం మొదలు పెడతాడు. అలా అతను చేసిన పనికి తన చుట్టూ ఉన్న వారు నవ్వుతారు, తిడతారు, నువ్వు అప్పులపాలై పోతావు అని భయపెడతారు, కాని అతను భయపడలేదు, తనపై తనకున్న నమ్మకాన్ని కోల్పోలేదు. అంతే కాదు వ్యాపారం మొదలు పెట్టిన 4 సంవత్సరాల వరకు ఎటువంటి ఆదాయం రాకపోయిన నిరుత్సహపడలేదు. 
అలా ఎంతో పట్టుదలగా నిలబడి ఈ రోజు ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల జాబితాలో మొదటి వాడిగా నిలబడ్డ వ్యక్తి, అమెజాన్ సంస్థల అధినేత మరియు ఆ సంస్థ సీఈఓ జెఫ్ బెజోస్


బాల్యం మరియు విధ్యాబ్యాసం :

 
జెఫ్ బెజోస్ అసలు పేరు జెఫ్రీ ప్రెస్టన్ జోర్గెన్సెన్. జెఫ్ బెజోస్ న్యూ మెక్సికో స్టేట్ లోని  అల్బుకెర్కీ అనే నగరంలో జన్మించాడు. జెఫ్ బెజోస్ జనవరి 12,1964న జాక్లిన్, టెడ్ జోర్గెన్సెన్ అనే దంపతులకు జన్మించాడు. జెఫ్ కు నాలుగు ఏళ్ళ వయసున్నప్పుడు తన తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోతారు. అలా వాళ్లిదరు విడిపోయిన తర్వాత జెఫ్ తల్లి క్యూబా వలసదారుడైన మైక్ ని పెళ్లి చేసుకుంటుంది. అలా జెఫ్ రెండవ తండ్రి మైక్, జెఫ్ ని దత్తత తీసుకుని, అతని పేరులోని  జోర్గెన్సెన్ ని బెజోస్ గా మారుస్తాడు. అప్పటినుండి జెఫ్ ప్రెస్టన్ బెజోస్ గా అతని పేరు మారుతుంది. జెఫ్ రివర్ ఓక్స్ ఎలెమెంట్రీ స్కూల్ లో చదువుతాడు. ప్రిన్సుటన్ యూనివర్సిటీ నుండి 4. జి.పి.యే తో తన గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందుతాడు.


వ్యక్తిగత విషయాలు : 


1993లో జెఫ్, మాకెంజీ స్కాట్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకి నలుగురు పిల్లలు పుట్టారు. 2019లో కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్లిద్దరు విడాకులు తీసుకుని విడిపోతారు. అయితే జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మాకెంజీ స్కాట్ తో విడాకులు తీసుకుని విడిపోవడం కోసం 38 బిలియన్లు చెల్లిస్తాడు. అలా ఈ విడాకులు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచాయి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక లారెన్ శాంచెజ్ అనే ఆవిడను జెఫ్ బెజోస్ పెళ్లి చేసుకుంటాడు.

జెఫ్ బెజోస్ మొదటగా ఫీటల్ అనే టెలీకమ్యూనికేషన్ కంపెనీలో హెడ్ అఫ్ డెవలప్మెంట్ గాను, డైరెక్టర్ ఆఫ్ కస్టమర్ సర్వీసెస్ గాను పని చేసాడు. అంతే కాకుండా బ్యాంక్ ట్రస్ట్ అనే బ్యాంకింగ్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్ గా కూడా పనిచేసాడు. 30 ఏళ్ళ వయసులో డి.ఇ.షా అనే హెడ్జ్ ఫండ్ కంపెనీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించాడు.
 

అమెజాన్ :


జెఫ్ బెజోస్ 1994వ సంవత్సరంలో అమెజాన్ అనే ఆన్ లైన్ ప్రోడక్ట్ డెలివరీ కంపెనీని స్థాపించాడు. జెఫ్ తన తల్లిదండ్రుల దగ్గర 3 లక్షల డాలర్లను తీసుకుని తన కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అలా మొదట్లో అమెజాన్ అమెరికాలోని కొన్ని ప్రదేశాలకు మాత్రమే వస్తువులను డెలివరీ చేసేది. అయితే అమెజాన్ యొక్క పనితీరు, డెలివరీ వేగంగా ఉండడం వల్ల ఎక్కువమంది ఇక్కడ కొనడానికి ఇష్టపడేవారు. మొదట్లో బుక్స్ మాత్రం సప్లై చేసే అమెజాన్ తర్వాతి రోజుల్లో
సి. డి.లు, డీవీడీ ప్లేయర్స్ లాంటివి కూడా డెలివరీ చేసేది. అలా నాలుగు సంవత్సరాల పాటు అలుపెరగని వ్యాపారాన్ని చేసిన తర్వాత కంపెనీ లాభాల బాట పట్టింది. కంపెనీ యొక్క అభివృద్ధి కోసం 2000 సంవత్సరంలో 2 బిలియన్ డాలర్లను బ్యాంకులో అప్పు తీసుకుంటాడు జెఫ్. ఆ డబ్బులతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మొదలు పెడతాడు. 
 
కంపెనీ మంచిగా లాభాల బాటలో నడుస్తుండగా అకస్మాత్తుగా వెబ్ బబుల్ బరస్ట్ ఏర్పడుతుంది. ఆ బబుల్ వల్ల కంపెనీ దివాళా తీసే పరిస్థితికి వస్తుంది. అయిన గాని జెఫ్ భయపడడు. కంపెనీని ముందుండి బలంగా నిలబెడతాడు. కంపెనీలో నష్టాలను నెమ్మది నెమ్మదిగా చక్కదిద్దుతూ 2003లో మళ్ళీ కంపెనీ లాభాలబాట పట్టేలా చేస్తాడు. బెజోస్ తన కంపెనీ యొక్క 1 మిలియన్ షేర్స్ అమ్మడం ద్వారా వచ్చిన 756 మిలియన్ డాలర్లతో తన కంపెనీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ను ప్రారంభిస్తాడు. అలా ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలను చేయడం ద్వారా కంపెనీని ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా మార్చాడు. జెఫ్ బెజోస్ అమెజాన్ తో పాటు అమెజాన్ కిండల్, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ ఫైర్ స్టిక్, అమెజాన్ పేమెంట్ సర్వీసెస్ లాంటి ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసాడు. అలా 2018 లో 160 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.          

సెప్టెంబర్ 2000వ సంవత్సరంలో, బెజోస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ స్టార్టప్ సంస్థ బ్లూ ఆరిజిన్ ను స్థాపించాడు. జెఫ్ స్పేస్ ప్రయాణాన్ని చాలా సులభతరం చేసి మనుషులు స్పేస్ లో బ్రతకడానికి కావలసిన పరిస్థితులను ఏర్పరచాలి అనే ఉద్దేశంతో ఈ బ్లూ ఆరిజిన్ సంస్థను స్థాపించాడు.
 
జెఫ్ బెజోస్ 5 ఆగష్టు 2013న ప్రముఖ మ్యాగజిన్ కంపెనీ అయిన ది వాషింగ్టన్ పోస్ట్ ను 250 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసాడు.    

25, నవంబర్ 2020, బుధవారం

నాయకుడిగా, మీ స్వంత విజయాన్ని చూడటమే కాదు, ఇతరుల విజయంపై కూడా దృష్టి పెట్టండి.

సుందర్ పిచాయ్


మనం ఏదైనా కొత్త పనిని మొదలుపెడితే మనకి ఆ పని మీద అవగాహన లేక భయం, మనం చేయగలమా లేదా అనే అనుమానం కలుగుతుంది. కాని మనం పట్టుదలతో, బలంగా నిలబడడం ద్వారా మన పనిలో ముందుకు సాగుతూ మనలోని భయాన్ని, అనుమానాలను దూరం చేసుకుని  విజయాన్ని సాధించగలుగుతాం. అలా తన చదువు నిమిత్తం వేరే దేశానికీ వెళ్లి మొదట్లో అక్కడ ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నా వాటిని ఎదురుకుని బలంగా నిలబడి ఈ రోజు ప్రపంచంలో ఎక్కువ సెర్చ్ రిజల్ట్స్ పొందుతున్న ప్రతిష్ఠాత్మక కంపెనీ అయిన గూగుల్ లో ఉద్యోగం సంపాదించడమే కాకుండా అతితక్కువ కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీ ప్రస్తుత సీఈఓగా వ్యవహరిస్తున్న భారతీయ దిగ్గజం సుందర్ పిచాయ్.


బాల్యం మరియు విధ్యాబ్యాసం :


సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్. సుందర్ పిచాయ్ 1972 జూన్ 10న తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జన్మించాడు. సుందర్ పిచాయ్ లక్ష్మి, రేగునాత పిచాయ్ అనే దంపతులకు జన్మించాడు. పిచాయ్ జవహర్ విద్యాలయంలో తన స్కూలింగ్ ను, వన వాణి స్కూల్ లో తన 12వ తరగతిని పూర్తి చేసాడు. మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఖరగ్ పూర్ లో తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసాడు. అంతేకాకుండా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో ఎం.ఎస్ చేసాడు. ఇంకా వార్టన్ స్కూల్ అఫ్ ది యూనివర్సిటీ అఫ్ పెన్నీసెల్వాని లో ఎంబీఏ పూర్తి చేసాడు.

 

వ్యక్తిగత విషయాలు : 


పిచాయ్ కాలేజీలో తనతో పాటు చదువుకున్న స్నేహితురాలు అయిన అంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. సుందర్ కు ఫుట్ బాల్, క్రికెట్ అంటే చాలా ఇష్టం. 

గూగుల్ : 


పిచాయ్ మొదట్లో మకిన్సాయ్ అనే కంపెనీలో మానేజ్మెంట్ కన్సల్టింగ్ టీమ్ లో పని చేసేవాడు. 
2004లో గూగుల్ కంపెనీలో చేరాడు. పిచాయ్ గూగుల్ ప్రొడక్ట్స్ అయిన గూగుల్ క్రోమ్, క్రోమ్ ఓ.ఎస్, గూగుల్ డ్రైవ్, క్రోమ్ బుక్ విభాగాల యొక్క అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాడు. మరియు జిమెయిల్, గూగుల్ మ్యాప్స్ యొక్క ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించాడు. అలా పిచాయ్ 
యొక్క కృషిని, కంపెనీ ఎదుగుదల కోసం ఎంతో కష్టపడుతున్న తన విధానాన్ని చుసిన గూగుల్, 5 ఆగష్టు 2015 న అతనిని తమ సంస్థ యొక్క సీఈఓగా నియమించింది.

అంతే కాకుండా గూగుల్ యొక్క మాతృ సంస్థగా పిలవబడే ఆల్ఫాబెట్ కంపెనీకి 2019 డిసెంబర్ న  సీఈఓగా పిచాయ్ నియమించబడ్డాడు. 

24, నవంబర్ 2020, మంగళవారం

అనగనగా రాగ మతిశయిల్లుచుండు తినగ తినగ వేము తియ్యనుండు.

 

సకల ఆరోగ్యదాయిని వేప


ప్రకృతి ప్రసాదించిన ఔషధ చెట్లలో వేపచెట్టు ప్రముఖమైనది. ఈ వేపచెట్టు యొక్క భాగాలను ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా వేపపుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. వేప పుల్ల యొక్క రసం శరీరంలోని వ్యర్ధాలను బయటకి పంపించడమే కాకుండా మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. కంటిలో దుమ్ము పడినప్పుడు వేపచుప్ ను కంటిలో వేసి కంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవచ్చు. చర్మసౌందర్యానికి ఉపయోగపడే బ్యూటీ ప్రొడక్ట్స్ లో మరియు సబ్బుల తయారీలో కూడా ఈ వేపను ఉపయోగిస్తారు. 


వేపచెట్టు మహోగాని కుటుంబానికి చెందినది. వేపచెట్టుకు పుట్టిల్లుగా భారతదేశం,బంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ దేశాలు ప్రసిద్ధిచెందాయి. వేపచెట్టును సంస్కృతంలో నీమ్ వృక్షం, అరబిక్ లో నీబ్, కన్నడలో వేపు,తమిళంలో వెప్పం, మలయాళంలో ఆర్య వెప్పు అని పిలుస్తారు. ఆఫ్రికాలో దీన్ని నలభై రకాల రోగాలను నయం చేసే చెట్టుగా భావిస్తారు. 

వేప చెట్టు యొక్క ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. మాములుగా వేపచెట్లు 30 నుండి 40 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయి. వేపు చెట్టుకు కొమ్మలు, ఆకులు ఎక్కువగా ఉంటాయి. వేపచెట్టు యొక్క ఎదుగుదలకు కొమ్మలు ఆకులు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. వేపచెట్టు కొమ్మలకు బెరడ్లు ఉంటాయి. ఆ బెరడు లోపల చెక్క ఉంటుంది. ఆ చెక్కను ఎక్కువగా ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు.  అంతే కాకుండా వేపచెట్టుకు కాసే కాయలను ఔషధాల తయారీలో వినియోగిస్తారు. 

ఆయుర్వేదంలో వేప చెట్టును సర్వరోగనివారిణిగా భావిస్తారు. చరకుడు అనే ఆయుర్వేదవైద్యుడు వేపచెట్టు గురించి ఇలా అన్నాడు. ఎవరైతే పగటి పూట వేపచెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతుకుతారు. తెలుగువారు సాంప్రదాయబద్ధంగా చేసుకునే ఉగాది పండుగలో ఉగాది పచ్చడిలో పులుపు కోసం వేప పువ్వు వినియోగిస్తారు. వేపపుల్లను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేపనూనెను సబ్బులు, షాంపూలు, చర్మ సౌందర్య ఔషధాలలో వినియోగిస్తారు.

చర్మవ్యాధులైన గజ్జి, తామర వచ్చినప్పుడు ఈ వేప ఆకుల గుజ్జును పూతగా పూస్తారు. అమ్మవారు వచ్చినప్పుడు  వేపాకులపై పడుకోబెడతారు. పొట్టలో పురుగులు, మధుమేహం వంటి వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. 


వేపచెట్టు యొక్క ఉపయోగాలు :


1) వేపచెట్టు పువ్వు ను ఉగాది పచ్చడిలో చేదు రుచి కోసం ఉపయోగిస్తారు. 
2) వేప పుల్లను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. 
3) వేపను ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. 
4) వేప చూపును కంటిలోని మలినాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. 
5) అమ్మవారు వచ్చినప్పుడు వేప ఆకులపై పడుకోబెడతారు. 
6) మధుమేహం లాంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. 
7) చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. 
7) వేపను చెక్కను మంచాలు, కుర్చీల తయారీలో ఉపయోగిస్తారు. 

21, నవంబర్ 2020, శనివారం

యోగా చేస్తూ మీ శరీరాన్ని, మనసును ధృడంగా ఉంచుకోండి.

యోగా ఆసనాలు


5000 సంవత్సరాల నుండి భారతదేశ సంస్కృతిలో భాగంగా ఎంతో మందికి శారీరక బలాన్ని, మానసిక సంతృప్తిని కలిగించిన పురాతన పద్ధతి యోగా. ప్రతి రోజు ఉదయం లేవగానే యోగాతో మన రోజును ప్రారంభించడం ద్వారా మనం ఆనందంగా మరియు సంతోషంగా మన పనులను చేసుకోగలుగుతాం. అంతే కాకుండా ఉపిరికి సంబంధించిన శారీరక వ్యాధులనుండి కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. వృద్ధాప్యం ద్వారా వచ్చే ముడతలను ఆలస్యంగా రప్పించడానికి మరియు ముఖం ప్రకాశవంతంగా ఉండడానికి ఈ యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

యోగా మన శరీరంలోని అన్ని అవయవాలని ఉత్తేజపరుస్తూ,వాటి యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. యోగాలో భాగమైన ఉఛ్వాస,నిఛ్వాస ప్రక్రియల ద్వారా మన ఊపిరితిత్తులను,శ్వాసక్రియ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. 

పురాతన యోగాలోని కొన్ని రకాలను గురించి తెలుసుకుందాం. 

1) అష్టాంగ యోగా :


ఈ యోగా విధానం పురాతన యోగా ఆసనాలను మనకు అందిస్తుంది. 1970వ సంవత్సర కాలంలో ఈ యోగా విధానాన్ని ఎక్కువ మంది ఇష్టపడేవారు. ఈ యోగా లోని ఫోజులకు  మన ఊపిరి కేంద్ర బిందువుగా ఉంటుంది. 

2) బిక్రమ్ యోగా :


ఈ యోగా విధానాన్ని హాట్ యోగా అని కూడా అంటారు. ఈ యోగాను 105 డిగ్రీల వేడి మరియు 40 శాతం తేమ ఉన్న గదిలో చేస్తారు. ఈ యోగాలో 26 ఆసనాలు ఉంటాయి. 

3) హత యోగా :


ఈ హత యోగా ఒక శారీరక వ్యాయామ విధానం. కొత్తగా ఎవరైనా యోగా మొదలు పెడితే ఇక్కడి నుండే మొదలు పెడతారు.

4) అయ్యంగార్ యోగా :


యోగా మ్యాట్,దుప్పట,కుర్చీలు,బల్లలపై ఉండి చేసే యోగా,అయ్యంగార్ యోగా. 

5) జీవముక్తి యోగా :


ఈ జీవముక్తి యోగాను జపం,ధ్యానం,ప్రాణాయామం,ఆసనం రూపంలో మనం చేస్తాం. అయితే ఈ యోగాను చేయడం కోసం కొంచెం కఠినంగా కష్టపడాలి. 

6) క్రిపాలు యోగా :


ఈ యోగా విధానం,యోగా శరీరానికి ఎంతగా ఉపయోగపడుతుందో తెలియజేస్తుంది. సాధారణంగా ఈ యోగా శ్వాస,చిన్నపాటి భంగిమలను కలిగి ఉంటుంది. 

7) కుండలిని యోగా :


ఈ కుండలిని యోగా యొక్క ముఖ్య ఉద్దేశం మనలో ఉన్న అంతర్ శక్తిని వెలికితీయడం. 

8) శివానంద యోగా :


ఈ ఆసనం 5 నియమాలపై ఆధారపడి పనిచేస్తుంది. అవి ఊపిరి,విశ్రాంతి,
డైట్,వ్యాయామం మరియు ప్రశాంతమైన ఆలోచనలు. 

9) పవర్ యోగా :


ఈ యోగాను 1980లో కొంత మంది అథ్లెటిక్ అధ్యాపకులు కనిపెట్టారు. అయితే ఈ పవర్ యోగా ప్రధమ ఉద్దేశం శరీర దృఢత్వం. 

18, నవంబర్ 2020, బుధవారం

ఖాదీ పరిశ్రమ గ్రామాల సౌరవ్యవస్థకు సూర్యుడు లాంటిది.

గాంధీ మెచ్చిన ఖాదీ


చేతి మగ్గాలపై సహజమైన ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన వస్త్రాలను ఖాదీ అంటాం. ఈ ఖాదీ పరిశ్రమలు ఎక్కువగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ ఖాదీ వస్త్రాలు భారతదేశ శాంతికి చిహ్నాలుగా ప్రతిష్ట పొందాయి. గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న సమయంలో స్వదేశీ నినాదం ద్వారా మగ్గంపై ఖాదీని తయారు చేసుకుని వాటిని వాడమని భారతదేశ ప్రజలకు విన్నవించాడు. అంతేకాకుండా మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఖాదీ వస్త్రాలను ధరించడం ద్వారా తనకు దేశంపై ఉన్న ప్రేమను, స్వదేశీ నినాదాన్ని మనకు తెలియచేస్తున్నారు. 


ఖాదిని ఖద్దర్ అని కూడా అంటారు. మొదట్లో భారతీయ జెండాలో ఈ ఖాదీ చక్రం ఉండేది. కాలక్రమేణ భారతీయ జెండాలో అశోక చక్రాన్ని ఉంచారు. అయితే 20వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం పనులకు నిరసనగా విదేశీ వస్తువులను కొనకూడని గాంధీ నినాదాన్ని లేవనెత్తారు, దానికి కారణం బ్రిటిష్ ప్రభుత్వం వేరే దేశాల నుండి బట్టలను కొనుక్కొని వచ్చి వాటినే ఇక్కడ వాడాలని ఆజ్ఞాపించేది. అందుకు వ్యతిరేకంగా భారతీయ ఖద్దర్ నే వాడేవారు. అలా భారతదేశంలో ఖాదీ బట్టలు చాలా ప్రాముఖ్యతను పొందాయి. 

ఈ ఖాదీ బట్టలు యొక్క కఠినమైన ఆకృతి చలికాలంలో చలి నుండి మనల్ని రక్షిస్తుంది. వేసవి కాలంలో ఒంటి చెమటను తగ్గించి ఎల్లప్పుడు తాజాగా ఉండేలా చేస్తాయి.

భారతదేశంలో ఈ ఖాదీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, 
తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ ఖాదితో హ్యాండ్లూమ్ చీరలు, ధోతిలు, తువ్వాలలు, చంబా రుమాల్, తుస్సర్ చీరలు తయారుచేస్తారు. ఇండియాలో మన్యవర్ అనే కంపెనీ ఖాదీ వస్తువులను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరు గడించింది.

భారతీయ మాస్టర్ చేనేత డిజైనర్ మరియు పద్మశ్రీ గ్రహీత గజమ్ అంజయ్య,  ఇకాట్ ప్రక్రియ ఆధారంగా ఉత్పత్తులను నేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించారు. 2017వ సంవత్సరానికి  ఖాదీ ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలలో మొత్తం 4,60,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారతదేశంలో 2019 సంవత్సరం నాటికి ఖాదీ వస్తువుల ద్వారా వచ్చే ఆదాయం 3215 కోట్లుగా ఉంది. అయితే భారతప్రభుత్వం ఆ ఆదాయాన్ని 5000 కోట్లకు చేర్చడానికి ప్రయత్నిస్తుంది. 

15, నవంబర్ 2020, ఆదివారం

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకుందాం. శరీరాన్ని బలంగా, ధృఢంగా ఉంచుకుందాం.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు


మనిషి పుట్టుక నుండి మరణం వరకు మనిషి జీవితంలో ప్రముఖ పాత్ర పోషించేది ఆహారం, ఒక మనిషికే కాదు ఈ విశ్వంలో ఉన్న అనేకరకాలైన జంతువులు, కీటకాలు, పక్షుల జీవన మనుగడకు ఈ ఆహారం ఎంతగానో అవసరం. ఇలా మనిషి బ్రతకడానికి ఆధారమైన ఈ ఆహారాన్నిసమయానికి తీసుకోకపోవడం, వేరేవారిమీద కోపంతో తినకపోవడం, ఏది పడితే అది తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం. ఒక ప్రపంచ సంస్థ ఆహారంపై చేసిన పరిశోధనలలో తెలిసిందేంటంటే, ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులు వృధా చేసే ఆహారం ఎన్నో లక్షల మందికి కడుపు నింపుతుందని వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచంలో ముందు ముందు రోజుల్లో దారుణమైన ఆహారపు కొరత వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ తన పరిశోధనల ద్వారా వెల్లడించింది.


మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధార పడి ఉంటుంది. అటువంటి ఆరోగ్యాన్ని అందించే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, విత్తనాలు, చపాతీలు, దంపుడుబియ్యం, మొలకెత్తిన విత్తనాలు మొదలైనవి మంచి పోషకవిలువలు ఉన్న ఆహారపదార్థాలు. 


ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా వచ్చే కొన్ని ఉపయోగాలను తెలుసుకుందాం.


1) మన శరీర బరువును తగ్గించుకోవడంలో ఈ ఆహారపదార్థాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. 

2) కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇవి మనకు సహకరిస్తాయి.
 
3) మధుమేహవ్యాధి ద్వారా వచ్చే చెడు దుష్పరిణామాల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహకరిస్తాయి.
 
4) గుండె సంబంధిత వ్యాధులు మరియు గుండె పోటు లాంటి జబ్బుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కావలసిన శక్తిని మన శరీరానికి అందిస్తాయి.

5) మన ముందు తరాల వారి యొక్క ఆరోగ్యం సక్రమంగా ఉండడం కోసం మనకు ఈ ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 

6) మన శరీరంలోని ఎముకలు, కండరాలు, దంతాలు బలంగా ఉండడం కోసం ఇవి మనకు సహకరిస్తాయి.
 
7) మన మనసు యొక్క ప్రశాంతతను పెంపొందించడంలో ఈ ఆహార పదార్థాలు మనకు ఎంతగానో సహకరిస్తాయి. 

8) మన యొక్క జ్ఞాపక శక్తి పెరుగుదలకు సహకరిస్తాయి. 

9) రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి  సహకరిస్తాయి. 

12, నవంబర్ 2020, గురువారం

ప్రతి వైఫల్యం ఒక మంచి పనికి మొదటి మెట్టు అని గుర్తుంచుకోవాలి.

కల్నల్ సాండర్స్  (కే.ఎఫ్.సి)


జీవితం అంటే ఒక ప్రయాణం. పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనం జీవితం అనే ప్రయాణంలో అలుపెరగని పోరాటాన్ని చేస్తాం. ఈ ప్రయాణంలో మనం ఒక సారి గెలుస్తాం మరొకసారి ఓడిపోతాం. కొంత మంది ఓటమిని అంగీకరించలేక బలన్మరణానికి పాల్పడతారు. మరికొందరు ప్రతి ఓటమి రేపటి గెలుపుకు పునాది అని భావిస్తారు. అలా తన జీవితంలో తను చేస్తున్న ప్రతి పని కూడా అతనిని ఓడిస్తూనే వచ్చింది. ఎన్నో సార్లు బాధతో నిద్రలేని రోజులు గడిపాడు. కొన్ని సార్లు చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు. కాని అటువంటి ఆలోచనలన్నింటి నుండి బయటకు వచ్చి బలమైన ప్రయత్నాన్ని చేస్తూ శక్తిమంతుడిలా నిలబడ్డాడు. అలా ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. అతను మరెవరో కాదు చాలా మందికి ఇష్టమైనఫ్రైడ్ చికెన్ ని తయారుచేసే  కే.ఎఫ్.సి. కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు కల్నల్ సాండర్స్ .

 

బాల్యం మరియు విధ్యాబ్యాసం :


కల్నల్ సాండర్స్ అసలు పేరు హర్లాండ్ డేవిడ్ సాండర్స్. ఇతను 9 సెప్టెంబర్ 1890లో అమెరికాలో ఉన్న ఇండియానా అనే స్టేట్ లోని హెన్రీవిల్లే అనే పట్టణంలో జన్మించాడు. సాండర్స్ విల్బర్ డేవిడ్, మార్గరెట్ అన్ సాండర్స్ అనే దంపతులకు జన్మించాడు. సాండర్స్ చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడం వల్ల ఇంటి భారం మొత్తం తన తల్లిపై పడుతుంది. అలా ఇంట్లోని  పరిస్థితుల వల్ల సాండర్స్ తన సెవెంత్ గ్రేడ్ విద్య పూర్తయిన తర్వాత చదువు మానేస్తాడు.


వ్యక్తిగత విషయాలు : 


సాండర్స్ 1909వ సంవత్సరంలో  జోసెఫిన్ కింగ్ అనే అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు.1947లో సాండర్స్ తన భార్య అయిన జోసెఫిన్ కింగ్ నుండి విడాకులు తీసుకుని విడిపోతాడు. ఆమె నుండి విడాకులు తీసుకున్న తర్వాత క్లాడియా ప్రైస్ అనే ఆవిడను 1949లో వివాహం చేసుకుంటాడు. 


ఉద్యోగాలు మరియు ఆవిష్కరణలు :


1906వ సంవత్సరంలో సాండర్స్  స్ట్రీట్ కార్ అనే కంపెనీలో కండక్టర్ గా పని చేస్తాడు. 
1907వ సంవత్సరంలో సాండర్స్  సథరన్ రైల్వేస్ వర్కుషాపులో హెల్పేర్ గా పని చేస్తాడు. 
1910 వ సంవత్సరంలో సాండర్స్ నార్ఫోక్ అండ్ వెస్ట్రెన్ రైల్వేస్ లో లేబర్ వర్క్ చేస్తాడు. 
1916వ సంవత్సరంలో సాండర్స్ ప్రేడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలో సేల్స్ మాన్ గా చేస్తాడు. 
1922వ సంవత్సరంలో సాండర్స్ ఛాంబర్ అఫ్ కామర్స్ కంపెనీలో సెక్రెటరీ గా పని చేస్తాడు. 
1923వ సంవత్సరంలో సాండర్స్ మిచెలీన్ టైర్ కంపెనీలో సేల్స్ మాన్ గా పని చేస్తాడు. 
1924వ సంవత్సరంలో సాండర్స్ స్టాండర్డ్ ఆయిల్ అఫ్ కెంటకీ కంపెనీలో జనరల్ మేనేజర్ గా పని చేస్తాడు.

1920వ సంవత్సరంలో సాండర్స్ ఫెర్రీ బోట్ అనే కంపెనీని స్థాపిస్తాడు. ఈ కంపెనీ చాలా గొప్ప సక్సెస్ అవుతుంది. అలా చిన్న వయసులోనే కంపెనీ షేర్ హోల్డర్ గా మారతాడు. ఆ కంపెనీలోని షేర్స్ ద్వారా సాండర్స్ కి 22000 ఆదాయం లభిస్తుంది. ఆ డబ్బులతో సాండర్స్ అసిటిలిన్ బల్బ్ అనే కంపెనీని స్థాపిస్తాడు. అయితే ఇది స్థాపించిన కొన్ని రోజులకే దివాళా తీస్తుంది.

కే.ఎఫ్.సి.(కెంటకీ ఫ్రైడ్ చికెన్ ) :


1939లో సాండర్స్ తన దగ్గర ఉన్న డబ్బులతో అశేవిల్లే అనే హోటల్ ని కొంటాడు. తను కొన్న అశేవిల్లే హోటల్లో ఫైర్ ఆక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత తన హోటల్ ని మళ్ళీ బాగుచేయించి 140 సీటర్ రెస్టారెంట్ గా మారుస్తాడు. ఆ హోటల్లో తను తయారు చేసిన సీక్రెట్ రెసిపీ అయిన కెంటకీ ఫ్రైడ్ చికెన్ ని అమ్ముతాడు. అయితే కొన్ని రోజులకు గ్యాస్ కొరత ఏర్పడడంతో ఆ హోటల్ మూసేస్తాడు. అలా దివాళా తీసిన తన వ్యాపారాన్ని 1942లో అమ్మేస్తాడు. అయితే తను తయారు చేసిన కెంటకీ ఫ్రైడ్ చికెన్ ని తన స్పెషల్ రెసిపీ గా భావించేవాడు. అలా 1952లో తన రెసిపీని బయటి హోటల్స్ లో అమ్మడానికి ఫ్రాంచేంజెస్ కోసం వెతుకుతాడు. అలా పెట్ హర్మాన్ అనే రెస్టారంట్ లో తన రెసిపీని అమ్మకానికి పెడతాడు. అయితే అది పెద్ద సక్సెస్ అవుతుంది. అప్పటి నుండి ఫ్రాంచేంజెస్ కోసం ఎన్నో కిలోమీటర్స్ ప్రయాణం చేసి పెద్ద పెద్ద హోటల్స్ లో తన రెసిపీని వాళ్ళ మేనుల్లోకి చేరుస్తాడు. అప్పటి నుండి సాండర్స్ వెనక్కి తిరిగి చుసుకున్నదే లేదు. ఎన్నో పెద్ద పెద్ద రెస్టారెంట్ లు ప్రాంచెంజి కోసం పోటీపడేవి. ఇలా వాళ్ళు అమ్మే ప్రతి చికెన్ పీస్ కి 0.04 డాలర్లను సాండర్స్ కు చెల్లిస్తారు. 1963 నాటికి కే.ఎఫ్.సి కంపెనీ  స్టోర్లు  600కు చేరుకుంటాయి. 1964వ సంవత్సరంలో సాండర్స్ తన కంపెనీని జాన్.వై.బ్రౌన్, జాక్.సి.మెస్సి కి 2 మిలియన్ డాలర్లకు అమ్మేస్తాడు.

మరణం :


సాండర్స్  1980వ సంవత్సరంలో అక్యూట్ లుక్కెమియా అనే రోగంతో మరణించాడు. 

6, నవంబర్ 2020, శుక్రవారం

ఉద్రేకంగా మరియు ధైర్యంగా ఉండండి. ఎల్లప్పుడూ నేర్చుకోవడం కొనసాగించండి. మీరు నేర్చుకోకపోతే ఉపయోగకరమైన పనులు చేయడం మానేస్తారు.

 సత్య నాదెళ్ల 


పెద్దలు ఎప్పుడు ఒక మాట అంటుంటారు. ఇంట గెలిచి కాదు రచ్చ గెలిచి చూడు అని. మన ఇంట్లో నాలుగు గోడల మధ్య మనం గెలిచి గొప్పవాళ్ళం అని అనిపించుకోవడం కాదు, బయట సమాజంలోకి వెళ్లి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ చుట్టూ ఉన్న వాళ్ళతో గొప్పవాడిని అని అనిపించుకోవడం నిజమైన గెలుపు అని అంటారు. చాలా మంది తమని తాము గొప్పవాళ్ళ గాను సమర్థులుగాను చూపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. కాని కొంత మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. అటువంటి వాళ్లలో ప్రముఖంగా చెప్పుకోవలసిన వ్యక్తి, భారతీయుడు, 
మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క ప్రధాన కార్య నిర్వాహక అధికారి సత్య నాదెళ్ల. 

                 

బాల్యం మరియు విధ్యాబ్యాసం :


సత్య నాదెళ్ల అసలు పేరు సత్యనారాయణ నాదెళ్ల. సత్య నాదెళ్ల 19 ఆగష్టు 1967న ఆంధ్రప్రదేశ్ లోని (ఇప్పుడు తెలంగాణా)హైదరాబాద్ నగరంలో జన్మించాడు. ఇతను యుగంధర్, ప్రభావతి అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు. సత్య తన చదువును హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పూర్తిచేసాడు. మరియు మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అనే విద్యా సంస్థలో బ్యాచిలర్ అఫ్ ఇంజనీరింగ్ పట్టాను పొందాడు. సత్య తన మాస్టర్ అఫ్ సైన్స్ డిగ్రీని యూనివర్సిటీ అఫ్ విస్కాన్సిన్ లో పొందాడు. అంతే కాకుండా యూనివర్సిటీ అఫ్ చికాగోలో తన ఎంబీఏ డిగ్రీని కూడా పొందాడు. 


వ్యక్తిగత విషయాలు : 


సత్య 1992లో అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు. సత్య చిన్నప్పటి నుండి క్రికెట్ ని ఎంతగానో ఇష్టపడేవాడు. సత్య ఎక్కువగా ఇండియన్ పోయెట్రీ బుక్స్ , అమెరికన్ పోయెట్రీ బుక్స్ ని చదువుతాడు. సత్య సీతల్ సోకర్స్ క్లబ్ కు ఒక యజమానిగా వ్యవహరిస్తున్నాడు. సత్య హిట్ రిఫ్రెష్ అనే బుక్ ని రాసాడు. ఈ బుక్ ద్వారా వచ్చిన డబ్బులను సేవా కార్యక్రమాలకు దానంగా ఇచ్చేసాడు. 

సత్య మొదట్లో సన్ మైక్రోసిస్టమ్స్ అనే కంపెనీలో పనిచేసేవాడు. 

మైక్రోసాఫ్ట్ :


సత్య 1992వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో పని చేసేవాడు. ఆ తర్వాత సత్య మైక్రోసాఫ్ట్ బిజినెస్ డెవలప్మెంట్ టీంకి వైస్ ప్రెసిడెంట్ గా  వ్యవహరించాడు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ డేటాబేస్, మైక్రోసాఫ్ట్ సర్వర్, డెవలపర్ టూల్స్ యొక్క ఉన్నతిలో ప్రముఖ పాత్ర పోషించాడు. అలా 2011లో 16 బిలియన్ డాలర్లు ఉన్న క్లౌడ్ సర్వీసెస్ ఆదాయాన్ని 20 బిలియన్ డాలర్లకు చేరువయ్యేలా చేసాడు. తద్వారా 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడు. అలా మైక్రోసాఫ్ట్ ను ప్రముఖ దిగ్గజ కంపెనీలకు ఏ మాత్రం తగ్గకుండా బలంగా నిలబెట్టాడు. సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా మోజంగ్, మైన్ క్రాఫ్ట్, క్సమరిన్ లాంటి కంపెనీలను కొని మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసాడు. అంతేకాకుండా లింకేడిన్ కంపెనీని 26 బిలియన్లకు కొని మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసాడు.   

ఇలా మైక్రోసాఫ్ట్ సీఈఓ గా ఎంతో గొప్ప పేరు సంపాదించిన సత్య, సి.ఎన్.బి.సి నిర్వహించిన వ్యాపార దిగ్గజాలకు ఇచ్చే అవార్డుల కార్యక్రమంలో గ్లోబల్ ఇండియన్ బిజినెస్ ఐకాన్ గా నిలిచాడు.

3, నవంబర్ 2020, మంగళవారం

పెట్టుబడి యొక్క ప్రాథమిక ఆలోచనలు స్టాక్‌లను వ్యాపారంగా చూడటం, మార్కెట్ యొక్క హెచ్చుతగ్గులను మీ ప్రయోజనం కోసం ఉపయోగించడం మరియు భద్రత యొక్క మార్జిన్‌ను పొందడం

వారెన్ బఫెట్


డబ్బు, డబ్బు, డబ్బు ! మనిషి జీవితంలో తరతరాలుగా డబ్బు అనే అంశం ఒక ప్రముఖ పాత్రను పోషిస్తోంది. అటువంటి ఈ డబ్బును సంపాదించడానికి ఎంతో కష్టపడాలి, శ్రమపడాలి. లేనివాడి కడుపు నింపుకోవడానికి కావాల్సింది డబ్బే, ఉన్నవాడి గౌరవాన్ని పెంచడానికి కావాల్సింది డబ్బే. అటువంటి ఈ డబ్బుపై ఎనలేని ఆసక్తిని, ప్రేమని కలిగివుండి, చిన్నప్పటి నుండి డబ్బును సంపాదిస్తూ, తను మొదలుపెట్టిన పనులలో గొప్పగా విజయం సాధిస్తూ, వ్యాపారాలలోను, 
పెట్టుబడుల విషయంలోనూ తనదైన ముద్రను వేసుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మంది జీవితాలకు మంచి దారిని చూపిన వ్యక్తి, వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, పరోపకారి,
బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ ఛైర్మన్ వారెన్ బఫెట్.

 

వారెన్ బఫెట్ అసలు పేరు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్. బఫెట్ నెబ్రాస్కాలోని  ఒమాహ అనే నగరంలో జన్మించాడు. బఫెట్ చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడంపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు. అలా అతను ఏడేళ్ల వయసులో చదివిన వెయ్యి డాలర్లు సంపాదించడానికి వెయ్యి మార్గాలు అనే పుస్తకం ద్వారా అతను డబ్బుపై ఇష్టాన్నిపెంచుకున్నాడు. అలా డబ్బు సంపాదించడం కోసం కోకా-కోలా బాటిల్స్ అమ్మడం, చూయింగ్ గమ్స్ అమ్మడం, న్యూస్ మాగజైన్ వేయడం వంటివి చేసేవాడు. అంతే కాకుండా తన తాత గారి నగల దుకాణంలో కూడా పని చేసేవాడు. అలా తన పదకొండేళ్ల వయసులో తన సోదరి డోరిస్ బఫెట్ తో కలిసి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో ఉన్న సిటీస్ సర్వీస్ లో షేర్స్ కొంటాడు. బఫెట్ కొన్ని రోజులకు తను దాచుకున్న డబ్బుతో పొలాన్ని కొనుకుంటాడు. బఫెట్ 14 ఏళ్ళ వయసులో తన మొదటి ఇన్ కమ్ టాక్స్ కట్టాడు. బఫెట్ కొలంబియా బిజినెస్ స్కూల్లో తన బిజినెస్ డిగ్రీని పొందాడు. 

బెంజిమెన్ గ్రాహం రాసిన ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే బుక్ ద్వారా బఫెట్ వేల్యూ ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత 1951 నుండి 1954 వరకు బఫెట్ ఫాల్క్ కంపెనీలో పెట్టుబడుల సేల్స్ మాన్ గా పని చేస్తాడు. తర్వాత 1954 నుండి 1956 వరకు గ్రాహం న్యూమాన్ కార్పొరేషన్ లో సెక్యూరిటీ అనలిస్ట్ గా చేస్తాడు. తర్వాత 1956 నుండి 1969 వరకు తను స్థాపించిన బఫెట్ పార్టనర్ షిప్ కి జనరల్ పార్టనర్ గా వ్యవహరించాడు. అలా 1970లో బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీని స్థాపించి దానికి ఛైర్మన్, వ్యవహారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఇలా ఎన్నో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ 1962లో తన పార్టనర్ షిప్ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయంతో మిలియనీర్ గా మారాడు. 

బఫెట్ ఎప్పుడు అప్పుచేసి బిజినెస్ చేయకూడదు అని అంటాడు. ఎప్పుడు కూడా బఫెట్  ఇన్వెస్టుమెంట్ విషయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే సూత్రాన్ని పాటిస్తాడు. అందుకే స్టాక్ మార్కెట్లో రేట్లు ఎక్కువగా ఉంటే బఫెట్ తక్కువ స్టాక్స్ కొంటాడు. తక్కువ రేట్లు ఉన్నప్పుడు ఎక్కువ స్టాక్స్ కొంటాడు. అంతే కాకుండా బఫెట్ ఏదైనా కొత్త వ్యాపారం చెయ్యాలనుకుంటే ఒకటి నుండి రెండు పుస్తకాలు చదివిన తర్వాతే తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు. అలా అమెరికాలో మూతపడే కంపెనీలను కొని వాటిని పెద్ద కంపెనీలుగా మార్చేస్తాడు. అలా తను తన పార్టనర్ చార్లీ మంగర్ తో కలిసి  కొన్న A గ్రేడ్ షేర్స్ ద్వారా బఫెట్ బిలియనీర్ గా ఎదిగాడు. 

1988లో కోకా-కోలా కంపెనీ 7 శాతం వాటాను 1.02 బిలియన్లకు కొనడం ద్వారా  బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ అతిపెద్ద కంపెనీల జాబితాలో చేరింది. ఇప్పటికి కూడా కోకా-కోలా కంపెనీలో బెర్క్‌షైర్‌ హాత్‌వే షేర్ హోల్డర్ గా కొనసాగుతుంది. అంతే కాకుండా ఆపిల్, ఐబీఎం లాంటి టెక్నాలజీ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా బఫెట్ తన ముందు చూపును ప్రదర్శించాడు. 2020 నాటికి  బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ క్రాఫ్ట్ హెయిన్జ్ కంపెనీలో 26.7 శాతం, అమెరికన్ ఎక్సప్రెస్స్ కంపెనీలో 17.6 శాతం, వెల్స్ ఫోర్గ్ కంపెనీలో 9.9 శాతం, కోకా-కోలా కంపెనీలో 9.32 శాతం, బ్యాంక్ అఫ్ అమెరికా కంపెనీలో 11.5 శాతం, ఆపిల్ కంపెనీలో 5.4 శాతం వాటాలను కలిగి ఉంది. 

బఫెట్ 2008లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో 62 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచాడు. 2010లో గివింగ్ ప్లెడ్జ్ ద్వారా బఫెట్, బిల్ గేట్స్, మార్క్  జూకర్ బర్గ్ తమ ఆదాయంలో 50 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ప్రమాణం చేసారు. 

31, అక్టోబర్ 2020, శనివారం

తదుపరి పెద్ద సృష్టి ఏమిటో గుర్తించడం ద్వారా మనం దేనిపై దృష్టి పెట్టాలి అనేది తెలుస్తుంది.

మార్క్ జూకర్ బర్గ్


మార్క్ జూకర్ బర్గ్ చదువుకునే వయసులోనే సాఫ్ట్ వేర్ ని తయారుచేసి దాన్ని అతితక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసాడు. అలా తాను తయారుచేసిన సాఫ్ట్ వేర్ పై విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకుని, ఒకానొక సమయంలో తన స్నేహితుల ఒత్తిడి వల్ల ఆ సాఫ్ట్ వేర్ ని అమ్మవలసి వచ్చినా గాని అమ్మకుండా ఈ రోజు ప్రపంచంలోని 10 మంది కుబేరుల జాబితాలో ఒకడిగా నిలిచాడు. జూకర్ బర్గ్ ప్రస్తుతం ఫేస్ బుక్ సంస్థకు సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు. మరియు వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్, ఒకులస్ వీ ఆర్ అనే సంస్థలకు అధినేత. 
 

బాల్యం మరియు విధ్యాబ్యాసం :


మార్క్ జూకర్ బర్గ్ అసలు పేరు మార్క్ ఇలియట్ జూకర్ బర్గ్. ఇతను 1984 మే 14న న్యూయార్కులోని వైట్ ప్లైన్స్ నగరంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఎడ్వర్డ్ జూకర్ బర్గ్, కరెన్. జూకర్ బర్గ్ తన చదువును అర్ద్ స్లే స్కూల్ మరియు ఫిలిప్స్ ఎక్సటర్ అకాడమీలో పూర్తి చేసాడు. ఆ తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరతాడు. కాని తన చదువు పూర్తి కాకుండా మధ్యలోనే  వదిలేస్తాడు. 


వ్యక్తిగత విషయాలు :


జూకర్ బర్గ్ 2003లో తన ప్రస్తుత భార్య అయిన ప్రిస్కిల్లా చాన్ ని కలుస్తాడు. ఆమెను కలిసిన కొన్ని రోజులకే వాళ్లిదరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. అలా ఆ బంధం ప్రేమగా మారుతుంది. తొమ్మిది సంవత్సరాల పాటు కలిసి ఉన్న వాళ్ళు 2012లో పెద్దల సమక్షంలో ఒకటవుతారు. వీళ్ళ పెళ్లితో పాటు చాన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఫంక్షన్ కూడా ఇక్కడే చేసుకుంటారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు.

ఫేస్ బుక్ :


ఫేస్ బుక్ సాఫ్ట్ వేర్ ని 2004 ఫిబ్రవరి 4న కేంబ్రిడ్జ్ లో మార్క్ జూకర్ బర్గ్, ఎడార్డ్ ఓ సావేరిన్, ఆండ్రూ మెకల్లమ్, డస్టిన్ మోస్కోవిట్జ్, క్రిస్ హ్యూగ్స్ కనిపెట్టారు. ఫేస్ బుక్ ముఖ్య కార్యాలయం మెన్లో పార్క్ , కాలిఫోర్నియాలో ఉంది. ఈ ఫేస్ బుక్ ని ఫొటోస్ మరియు ముఖ్యమైన సందేశాల షేరింగ్ ద్వారా ఒకరితో ఒకరికి సత్సంబంధాలు పెరగడం కోసం ఉపయోగించేవారు.  మొదట్లో ఫేస్ బుక్ ని కొన్ని అమెరికన్ విశ్వవిద్యాలయాలలో మాత్రమే ఉపయోగించేవారు. ఫేస్ బుక్ అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో సక్సెస్ అవ్వడంతో ఫేస్ బుక్ ని పబ్లిక్ లోకి తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతారు. అందుకోసం కాలిఫోర్నియాలో ఒక చిన్న ఆఫీస్ అద్దెకు తీసుకుని అక్కడ కంపెనీని స్టార్ట్ చేస్తారు. అలా ఫేస్ బుక్ సాఫ్ట్ వేర్ ని పబ్లిక్ లోకి లాంచ్ చేసిన కొన్ని సంవత్సరాలకే ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను సంపాదించుకుంటుంది. అంతేకాకుండా ఫేస్ బుక్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారు అతి తక్కువ సమయంలోనే అపర కుబేరులుగా మారిపోయారు. అలా జూన్ 30, 2020 నాటికి ఫేస్ బుక్ లో 52,534 మంది పని చేస్తున్నారు. ఈ ఫేస్ బుక్ కు ప్రస్తుత సీఈఓ గా మార్క్ జూకర్ బర్గ్, సిఓఓ గా షెరిల్ సాండ్బర్గ్, సిఎఫ్ఓ గా డేవిడ్ వెహ్నేర్, సిటిఓ గా మైక్ స్క్రాప్ఫర్, సిపిఓ గా క్రిస్ కాక్స్ పని చేస్తున్నారు. 

ఫేస్ బుక్ ను లాంచ్ చేసిన కొన్ని సంవత్సరాలకు ఫేస్ బుక్ మెసెంజర్ ను కూడా స్టార్ట్ చేసారు. ఈ ఫేస్ బుక్ మెసెంజర్ ను వాట్సాప్ మాదిరిగా సందేశాల షేరింగ్ కోసం వినియోగిస్తారు. మార్క్ జూకర్ బర్గ్ వాట్సాప్ కంపెనీని 2014లో 19 బిలియన్ డాలర్స్ కు కొనుగోలు చేసాడు. అంతే కాకుండా ఇన్ స్టాగ్రామ్ ను 2012లో 1 బిలియన్ డాలర్స్ కు కొనుగోలు చేసాడు.

జూకర్ బర్గ్ తన భార్య చాన్ తో కలిసి చాన్ జూకర్ బర్గ్ ఇనిషియేటివ్ అనే సేవా సంస్థను స్థాపించాడు. జూకర్ బర్గ్ ఈ  చాన్ జూకర్ బర్గ్ ఇనిషియేటివ్ సేవా సంస్థ ద్వారా ఎన్నో దేశాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.

దానాలు :


2010లో గివింగ్ ప్లెడ్జ్ ద్వారా ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్  జూకర్ బర్గ్, బెర్కషైర్ హతవే ఫౌండర్ బఫెట్, మైక్రోసాఫ్ట్  ఫౌండర్ బిల్ గేట్స్ తమ ఆదాయంలో 50 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ప్రమాణం చేసారు.

2014లో జూకర్ బర్గ్, చాన్ జూకర్ బర్గ్ ఇనిషియేటివ్ ద్వారా ఎబోలా వైరస్ డిసీస్ ట్రీట్మెంట్ అందించడం కోసం 25 మిలియన్ డాలర్లను దానం చేసాడు.

2015లో జూకర్ బర్గ్, చాన్ జూకర్ బర్గ్ ఇనిషియేటివ్ కు తమ సంపాదనలో 99 శాతం వాటాను ఇవ్వడం ద్వారా ఎంతో మందికి మంచి చదువు, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. 

జూకర్ బర్గ్, సెప్టెంబర్ 2020 నాటికి 111 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు.

28, అక్టోబర్ 2020, బుధవారం

తన అందంతో ,ఆకృతితో కోట్ల మంది వీక్షకులను కట్టిపడేసిన కట్టడం ఈఫిల్ టవర్.

ఈఫిల్ టవర్


ప్రపంచంలోని అతి పెద్ద కట్టడాలలో ఒకటైన కట్టడం, కోట్ల మందిని తన అందంతో కట్టిపడేసిన కట్టడం, కట్టి ఎన్నో సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా బలంగా నిలబడిన కట్టడం, చరిత్రలో తన కంటూ ఒక ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్న కట్టడం, జీవితంలో ఒకసారైనా చూడాల్సిన కట్టడం ప్యారిస్ లో నిర్మించబడిన ఈఫిల్ టవర్ కట్టడం.


ఈఫిల్ టవర్ చరిత్ర :


ఈ ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ దేశం, ప్యారిస్ నగరంలోని చాంప్ డే మార్స్ లో ఉంది. ఈ ఈఫిల్ టవర్ ని చేత ఇనుప జాలకం తో నిర్మించారు. ఈ ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే 2వ అతి పెద్ద టవర్ గా కీర్తిని గడించింది. 

మారిస్ కొచ్లిన్ మరియు ఎమిలే నౌగియర్ అనే ఇద్దరు డిజైనర్స్  సొసైటీ డి ఎక్స్ప్లోయిటేషన్ డి లా టూర్ ఈఫిల్ అనే కంపెనీలో పని చేసేవారు. ఈ కంపెనీకి బాస్ గుస్తావే ఈఫిల్. వీళ్ళిద్దరూ ఈఫిల్ టవర్ యొక్క డిజైనును రూపొందించారు. డిజైన్ పూర్తయిన వెంటనే ఆ ఇద్దరు డిజైనర్స్ ఆ డిజైన్ ను తమ బాస్ అయిన ఈఫిల్ కి చూపిస్తారు, ఆ డిజైన్ చూసిన ఈఫిల్ కొన్ని మార్పులను చేయమంటాడు. అప్పుడు డిజైనర్స్ ఇద్దరు స్టీఫెన్ సౌవేస్టర్ తో కలిసి బేస్ డిజైన్, డెకరేషన్స్ చేసి పూర్తి డిజైన్ ని ఈఫిల్ కి చూపించి ఆమోదాన్ని పొందుతారు. అసలు ఈ టవర్ కట్టడానికి ప్రధాన కారకుడు ఈఫిల్. ఈఫిల్ న్యూ యార్క్ లో ఉన్నలాటింగ్ అబ్జర్వేటరీ కట్టడాన్ని ప్రేరణగా తీసుకుని దీన్ని నిర్మించాలని అనుకున్నాడు.

ఈఫిల్ ఆమోదాన్ని పొందిన ఈ టవర్ యొక్క ఎత్తు 300 మీటర్లుగా నిర్దారిస్తారు. అయితే మొదట్లో 300 మీటర్ల ఎత్తు గల భవనం యొక్క నిర్మాణం సాధ్యం కాదని అందరూ అనేవారు, కొంతమంది నేరుగానే టవర్ ని నిర్మించాలనుకున్న ఈఫిల్ ని విమర్శించేవారు. కాని ఈఫిల్ వాటిని లెక్క చేయలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద టవర్ ని నిర్మించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనుకున్నదే తడువుగా ప్రణాళికలను రూపొందించి పనులను చకచకా ముందుకు నడిపించాడు. అయితే ఈ టవర్ యొక్క డిజైన్ నాలుగు వేరువేరు లాటిస్ గిర్డర్ స్థంబాలపై నిలబడి చివర్లో కలిసినట్టుగా ఉండేలా రూపొందించారు.

ఈఫిల్ ఈ డిజైన్ కి ఆమోదాన్ని పొందడమే కాకుండా దీన్ని ఆర్ట్స్ డిజైన్ ఎక్సిబిషన్ లో ప్రదర్శిస్తాడు. అలా మార్చి 30, 1885 న, ఈఫిల్ తన ప్రణాళికలను సొసైటీ డెస్ ఇంజినియర్స్ సివిల్స్‌కు సమర్పిస్తాడు. సాంకేతిక సమస్యలను చర్చించిన తరువాత మరియు టవర్ యొక్క ఆచరణాత్మక ఉపయోగాలను నొక్కిచెప్పిన తరువాత, టవర్ ప్రతీకను గురించి చెప్పి తన ప్రసంగాన్ని ముగిస్తాడు. అలా ఎన్నో ఆమోదాలు పొందిన తర్వాత 28 జనవరి 1887లో ఈ ఈఫిల్ టవర్ కట్టడాన్ని నిర్మించడం మొదలు పెడతారు. 2 సంవత్సరాల పాటు అలుపెరగని నిర్మాణాన్ని జరిపి చివరకు 15 మార్చి 1889లో టవర్ యొక్క నిర్మాణం పూర్తి చేస్తారు. 31 మార్చి 1889లో ఈ ఈఫిల్ టవర్ ని ప్రారంభించారు. ఈఫిల్ టవర్ పై ఏర్పరచిన టిప్ తో కలిసి ఈ టవర్ యొక్క మొత్తం పొడవు 324 మీటర్లుగా నిర్దారించారు.

ఈ టవర్ సందర్శకుల సౌకర్యార్ధం కోసం మూడు స్థాయిలుగా విభజించబడింది. మొదటి స్థాయికి రెండవ స్థాయికి వెళ్ళడానికి మెట్ల సౌకర్యం ఉంది. మొదటి రెండు స్థాయిలలో రెస్టారెంట్స్ ఉంటాయి. మూడవ స్థాయికి వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నాయి కాని ఎక్కువ దూరం కావడం వల్ల సందర్శకులు లిఫ్ట్ లోనే వెళ్తారు. భూమి నుండి మూడవ స్థాయికి ఈ టవర్ ఎత్తు 276 మీటర్లుగా ఉంది.

2015వ సంవత్సరంలో డబ్బులు కట్టి సందర్శించే కట్టడాల్లో 69 లక్షల మంది సందర్శించిన 
అద్భుత కట్టడంగా చరిత్రలో నిలిచింది.

25, అక్టోబర్ 2020, ఆదివారం

మీరు అందరిలాగే ఉండబోతున్నట్లయితే ఈ భూమిపై మనం ఉన్నదానికి అర్ధం ఏముంటుంది.

ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్


ప్రొద్దుట లేచినప్పటి నుండి మరలా రాత్రి పడుకునేంత వరకు రకరకాల ఆలోచనలతో, బాధలతో జీవితాన్ని గడుపుతాం. అటువంటి ఈ జీవితంలో ఏదైనా సాధించాలి, గొప్పగా అవ్వాలి అనుకుంటే మనల్ని ముందుగా పలకరించేవి భయం, అసమర్ధత, నా వల్ల అవుతుందా, నేను సాధించగలనా అనే అనుమానాలే. ఈ ఆధునిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త బ్రాండ్లు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. అటువంటి ఈ ప్రపంచంలో నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అని మనల్ని మనం అసమర్థులుగా మార్చుకుంటున్నాం. ఏదైనా పనిని మొదలు పెట్టి అందులో ఓడిపోతే మన వల్ల కాదు, మనం ఇంకా ఏమి సాధించలేం అని అనుకుంటూ మనల్ని మనం కించపరుచుకుంటూ ముందుకు నడుస్తుంటామ్. అటువంటి ఈ సమాజంలో  పుట్టి చిన్న వయసులోనే బాడీ బిల్డర్ అవ్వాలనే లక్ష్యంతో అమెరికా వచ్చి అక్కడి పోటీల్లో పాల్గొని ప్రపంచ నెంబర్.1 బాడీ బిల్డర్ అవ్వడం. సినిమాలలో నటించి నెంబర్.1 అనిపించుకోవడం. అమెరికా రాజకీయాలలోకి ప్రవేశించి గవర్నర్ గా పదవిని చేపట్టడం. ఎన్నో సార్లు మరెన్నో సార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించడం. తాను ఏదైతే కావాలనుకున్నాడో, ఏదైతే సాధించాలనుకున్నాడో దాని కోసం బలమైన సంకల్పంతో, కసితో ముందుకు సాగడం. ఇలా అన్ని విషయాలలోను గొప్పగా నిలిచిన అతను మరెవరో కాదు ప్రముఖ బాడీ బిల్డర్, యాక్టర్, రాజకీయవేత్త, వ్యాపారవేత్త అయిన ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్.  



బాల్యం మరియు విధ్యాబ్యాసం :


ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ అసలు పేరు ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగ్గర్. ఇతను 30 జులై 1947లో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు. ఇతను ఆరేలియా మరియు గుస్తావ్ స్క్వార్జెనెగ్గర్ అనే దంపతులకు జన్మించాడు. ఆర్నాల్డ్  తన చదువును ట్రేడ్ స్కూల్ లో పూర్తి చేసాడు. శాంటా మోనిక కాలేజీ యూనివర్సిటీ అఫ్ విస్కాన్సిన్ సుపీరియర్ లో బి.ఏ పూర్తి చేసాడు.

 

వక్తిగత విషయాలు :


ఆర్నాల్డ్ 1986వ సంవత్సరంలో మరియా శ్రీవేర్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు పుట్టారు. 2011వ సంవత్సరంలో వీళ్ళద్దరు విడిపోయారు. 2015 వ సంవత్సరం నుండి తన కంటే వయసులో 27 ఏళ్ళ చిన్నదైన హీథర్ మిల్లిగాన్ అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. 


 బాడీ బిల్డింగ్ :


బాడీ బిల్డింగ్ చరిత్రలో తమకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఆర్నాల్డ్ ముందు వరసలో ఉంటాడు. ఆర్నాల్డ్ తన 14 ఏళ్ళ వయసులో ఒలింపిక్స్ గేమ్స్  కోసం వెయిట్ లిఫ్టింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఆర్నాల్డ్ 15 ఏళ్ళ వయసులోనే అద్భుతమైన శరీరాన్ని తన సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది ముందు బాడీబిల్డర్లు అయ్యి ఆ తర్వాత హీరోస్ గా మారారు అలానే ఆర్నాల్డ్ కూడా అవ్వాలనుకుంటాడు. అలా తన 18 ఏళ్ళ వయసులో ఆస్ట్రియా నుండి అమెరికా వచ్చేస్తాడు. అమెరికా వచ్చిన ఆర్నాల్డ్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ అవ్వాలనే కసితో రోజుకు 6 గంటలు కష్టపడే వాడు. తనలో ఉన్న పట్టుదలను చుసిన బాడీ బిల్డింగ్ ట్రైనర్ జోయీ వెల్డర్ ఆర్నాల్డ్ ని  గొప్పగా ప్రోత్సహించేవాడు. 

అలా ఆర్నాల్డ్ 2 సార్లు పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ గాను, 2 సార్లు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ గాను ఎన్నికయ్యాడు. అంతే కాకుండా మిస్టర్ యూనివర్స్ గా 4 సార్లు ఎన్నికయ్యాడు. 7 సార్లు మిస్టర్ ఒలింపియా గా కూడా ఎన్నికయ్యాడు. 

1980వ సంవత్సరంలో తన 33వ యేట బాడీబిల్డింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 

అమెరికాలో ప్రతి ఏటా ఆర్నాల్డ్ క్లాసిక్ అనే పేరుతో బాడీబిల్డింగ్ ఛాంపియన్ షిప్ ని నిర్వహిస్తున్నారు. 

సినిమా యాక్టింగ్ :


బాడీబిల్డర్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్  1970లో హెర్క్యూలేస్ ఇన్ న్యూ యార్క్ అనే సినిమాతో హాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అయితే తను మొదటి నుండి బాడీబిల్డర్ కావడంతో యాక్టింగ్ చేయడం చాలా ఇబ్బందయ్యేదని, తన భాష కూడా సరిగ్గా ఎవరికి అర్ధమయ్యేది కాదని ఆర్నాల్డ్ పలు ఇంటర్వూస్ లో చెప్పాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గాని పట్టుదలతో ప్రయత్నించి హాలీవుడ్ సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలా హాలీవుడ్ హిట్ మూవీస్ అయిన స్టే హంగ్రీ, పంపింగ్ ఐరన్, ది విలన్, ది టెర్మినేటర్, ది రన్నింగ్ మాన్, ట్విన్స్, టోటల్ రీకాల్, టెర్మినేటర్ 2, జూనియర్, ట్రూ లైస్, ఎరేజర్, టెర్మినేటర్ 3, ఎక్సపండబుల్స్, ఎక్సపండబుల్స్ 2, టెర్మినేటర్ డార్క్ ఫేట్ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలలో నటించాడు. 

రాజకీయ జీవితం :


ఆర్నాల్డ్ మొట్టమొదటగా అమెరికా వచ్చిన కొత్తలో రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో అధ్యక్ష అభ్యర్థి అయిన నిక్సన్-హంఫ్రీ మాట్లాడడం విన్నాడు. ఆయన సోషలిజం విధానాలతో మాట్లాడడం, స్వేచ్ఛ హక్కుల గురించి మాట్లాడడం, పన్నులు తగ్గించడం, మిలటరీ బలోపేతం గురించి మాట్లాడడం ఇవన్ని ఆర్నాల్డ్ లో తెలియని ఉద్రేకాన్ని కలిగించాయి. అలా తన ఆలోచనలకు తగ్గట్టుగా అతను మాట్లాడం ఆర్నాల్డ్ కి రిపబ్లికన్ పార్టీ పై, హంఫ్రీ పై ఇష్టాన్ని పెంచాయి. అలా ఆర్నాల్డ్ తనను రిపబ్లికన్ మెంబర్ గా అనుకునేవాడు. 

ఆర్నాల్డ్ 1988 ప్రెసిడెంట్ ఎలక్షన్ కాంపెయిన్ లో తను రిపబ్లికన్ మెంబర్ అని ప్రకటించాడు. 
1990 నుండి 1993 వరకు ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆన్ ఫీజికల్ ఫిటినెస్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో చైర్మన్ గా పనిచేసాడు. 
ఆ తర్వాత గవర్నర్ పెట్ విల్సన్ ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాలిఫోర్నియా గవర్నర్ కౌన్సిల్ ఆన్ ఫిజికల్ ఫిటినెస్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో ఛైర్మన్ గా పనిచేసాడు. 
1993 నుండి 1994 వరకు రెడ్ క్రాస్ అంబాసిడర్ గా పనిచేసాడు. 
ఇలా ఎన్నో విభాగాలలో రిపబ్లికన్ పార్టీ ద్వారా సేవలందించిన ఆర్నాల్డ్ క్యాలిఫోర్నియా గవర్నర్ గా 2003 నుండి 2011 వరకు పనిచేసాడు. 

వ్యాపారాలు :


బాడీబిల్డర్, సినిమా యాక్టర్, బిజినెస్ మాన్ గానే కాకుండా వ్యాపార రంగంలోను ఆర్నాల్డ్ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. 
తను బాడీబిల్డింగ్ చేస్తున్న సమయంలోనే బ్రిక్ వ్యాపారం మొదలు పెట్టి తన మొదటి వ్యాపారంలో గొప్పగా విజయం సాధించాడు. 
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. 
1992 లో తన భార్యతో కలిసి రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టి విజయం సాధించాడు. 
అలా 2006 నాటికి ఆర్నాల్డ్ నికర ఆదాయం 800 మిలియన్ డాలర్లకు చేరింది. 

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...