information లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
information లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2021, శుక్రవారం

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి


పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయితే అతనికి వృధాప్యం రావడం వల్ల అతను వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేకపోతాడు. పరమభక్తుడైన ద్వారకుడి ఇబ్బందిని గ్రహించిన వేంకటేశ్వరుడు అతను నివాసం ఉంటున్న ప్రదేశంలో విగ్రహ రూపంలో వెలుస్తారు. అలా వేంకటేశ్వర స్వామి వారు ద్వారకుడి వలన ఇక్కడ వెలిశారని ఆయన గుర్తుగా ఈ ప్రదేశాన్ని ద్వారకా తిరుమల అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. పెద్ద తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్న వారు చిన్న తిరుపతిలో ఆ మొక్కును చెల్లిస్తే వారికి పెద్ద తిరుపతిలో మొక్కు చెల్లించిన ఫలితం లభిస్తుంది అని అంటారు. కాని చిన్న తిరుపతిలో  మొక్కిన మొక్కు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని అక్కడి జనం అంటుంటారు.


ఈ వేంకటేశ్వరుని దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలోని మండలం మరియు గ్రామం అయిన ద్వారకా తిరుమలలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం ఏలూరుకు 42 కిలోమీటర్ల దూరంలోను, భీమడోలుకు 15 కిలోమీటర్ల దూరంలో కొలువై వుంది. ప్రస్తుతం ఉన్న గుడి,  మండపము, గోపురము, ప్రాకారాలను నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు గారు కట్టించారు. బంగారు ఆభరణాలు,వెండి వాహనాలను రాణి చిన్నమ్మ రావు స్వామి వారికి సమర్పించారు. ఈ గ్రామం పశ్చిమాన స్వామి వారి పుష్కరిణి ఉంటుంది. దీనిని సుదర్శన పుష్కరిణి, కుమార తీర్థమని  అంటారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవంను కన్నుల పండుగగా జరుపుతారు. 

వేంకటేశ్వర స్వామి ఒక సందర్భంలో ఆశ్రమంలో ఉండవలసి వస్తుంది. ఆ సమయంలో వేంకటేశ్వర స్వామికి ఆకలి వేస్తే అప్పుడు అక్కడికి వచ్చిన ఆవు యొక్క పాలను త్రాగుతాడు. అది చుసిన ఆ ఆవు యొక్క యజమాని కోపంతో వేంకటేశ్వరుని తలపై కర్రతో గట్టిగా కొడతాడు. అప్పుడు వేంకటేశ్వరుని తలపై చిన్న గాయం అవ్వడమే కాకుండా జుట్టు కూడా కొంచెం ఊడిపోతుంది. అయితే కలియుగ దైవం  అయిన వేంకటేశ్వర స్వామిని జుట్టు లేకుండా చుసిన గాంధర్వ కన్యా రాకుమారి అయిన నీలాదేవి తన కొప్పులో నుండి కొన్ని వెంట్రుకలను తీసి స్వామి వారి తలపై అలంకరిస్తుంది. అప్పటి నుండి స్వామివారిని దర్శించుకున్న భక్తులు నీలాదేవిని గౌరవిస్తూ తమ నీలాలను స్వామి వారి గుడి ప్రాంగణంలో ఉన్న కళ్యాణ కట్టలో సమర్పిస్తారు. 

ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు కొండ పైన ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయం మరియు వేంకటేశ్వరుని మందిరానికి వెళ్లే మార్గమధ్యంలో ఉన్న కుంకుళ్ళమ్మ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ పుణ్యస్థలానికి వచ్చిన వారు ఈ మందిరాలను కూడా దర్శించుకుని వెళ్తారు. అంతే కాకుండా కొండ పైన ఉన్న గోశాలలోని గోవులు, మరియు గజరాజులు మనకు కనుల విందు కలిగిస్తాయి. 

స్వామి వారి దేవస్థానము ఆధ్వర్యంలో ఉన్న పద్మావతి వసతి గృహం, ఆండాళ్ అతిధి గృహం, సీత నిలయం, టీటీడీ అతిధి గృహాలు మనకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మీరు  ఏ సమయంలో వచ్చిన ఇక్కడ బస చేయవచ్చు. అంతేకాకుండా ప్రతి రోజు నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చిన భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయితే దీనికోసం  భక్తులు ముందుగానే టిక్కెట్ కౌంటర్ వద్ద టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్వామి వారి లడ్డు ప్రసాదం కోసం కూడా ముందుగానే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భక్తులు ఈ లడ్డు కోసం డబ్బు చెల్లించవలసి ఉంటుంది.  

విజయవాడ నుండి ద్వారకా తిరుమలకు 98 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 72 కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం నుండి 47 కిలోమీటర్లు, భీమడోలు నుండి 17 కిలోమీటర్లు దూరం ఉంటుంది. 

5, జనవరి 2021, మంగళవారం

తులసి మన ఇంట ఆరోగ్యం మన వెంట.

తులసి  చెట్టు


హిందువుల ఆరాధ్య దైవాలలో ఒకరైన విష్ణువుకు ప్రీతిపాత్రమైన చెట్టు తులసి చెట్టు. తెలుగింటి ఆడపడుచులు తులసి చెట్టును తమ దైవంగా ప్రార్థిస్తారు. తులసి ఆకుల తీర్దాన్ని ప్రతి గుడిలోనూ భక్తులకు అందిస్తారు. తులసి చెట్టు సర్వరోగ నివారిణిగా మనకు ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ఉన్న ఇంటిలో త్రిమూర్తులు కొలువుంటారని ప్రతీతి. అంతేకాకూండా 2000 సంవత్సరాల ఆయుర్వేద వైద్యంలో తులసి చెట్టు ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా ఔషధాల
తయారీలోను ఈ తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ప్రాణవాయువును విడుదల చేస్తుంది. హిందువుల ముఖ్య పండుగలలో తులసి ఆకులను పూజ చేయడానికి ఉపయోగిస్తారు.


ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మాత పూజను హిందువులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఆ రోజు తులసి చెట్టు చుట్టూ పందిరి వేసి ఆ పందిరిని మావిడాకులతో అలంకరించి,
బాణాసంచా కాలుస్తూ నిష్ఠగా ఆ పూజను ఆచరిస్తారు. ఉదయాన్నే తులసి చెట్టును దర్శించడం ద్వారా పాపాలు నశిస్తాయి. తులసి చెట్టు ఉన్న చోట దుష్టశక్తులు దరిచేరవు. హిందువుల ఆచార సాంప్రదాయాలలో తులసి చెట్టును విశిష్టంగా వాడతారు. యేసుక్రీస్తును శిలువ వేసిన చోట తులసి చెట్టు మొలచిందని అంటుంటారు.

తులసి చెట్టు యొక్క ఉపయోగాలు :


1) తులసి ఆకులు తినడం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. 
2) తులసి ఆకుల రసాన్ని డెంగ్యూ, మలేరియా జ్వరం లాంటి రోగాలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. 
3) తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగడం ద్వారా గొంతు గరగరను తగ్గించుకోవచ్చు. 
4) ప్రతి రోజు 5 తులసి ఆకులను ధనియాలు,మిరియాలతో కలిపి మిశ్రమంగా చేసుకుని తింటే పొట్టలోని నులి పురుగులు నశిస్తాయి. 
5) రెండు స్పూన్ల తులసి ఆకుల రసాన్ని తేనె కలుపుకుని తాగడం వల్ల పైత్యం తగ్గుతుంది. 
6) తులసి ఆకులను నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. 
7) తులసి ఆకులు తినడం వల్ల చెడు శ్వాస తగ్గుతుంది,
8) తులసి ఆకులను మజ్జిగలో వేసుకుని తాగితే బరువు తగ్గుతుంది. 
9) తులసి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
10) తులసి ఆకులను తీసుకుంటే మూత్రపిండాలు శుభ్రమవుతాయి. 
11) తులసి ఆకులు తింటే గుండెకు రక్త సరఫరా సక్రమంగా అయ్యేలా చేస్తాయి. 
12) ఎన్నో రకాల ఔషధగుణాలు ఉన్న తులసి ఆకులను తిందాం, ఆరోగ్యంగా ఉందాం.  

27, డిసెంబర్ 2020, ఆదివారం

తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న సినిమా తెలుగు సినిమా.

తెలుగు సినీ పరిశ్రమ (TFI)


ప్రపంచ పటంలో ఎక్కడో మారుమూల చిన్న పరిశ్రమ. కాని ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ సినిమాలను రూపొందిస్తోంది ఈ పరిశ్రమ. భారత దేశ సినిమా ఖ్యాతిని నలుదిశలకు ప్రసరింప చేస్తూ బలంగా నిలబడింది ఈ పరిశ్రమ. అంతేకాకుండా యువతరానికి నేనున్నాను అన్న భరోసాను కలిగిస్తుంది ఈ పరిశ్రమ. ఎంతో మంది యువ నటీనటులకు,నిర్మాతలకు,దర్శకులకు అవకాశం కల్పిస్తోంది ఈ సినీ పరిశ్రమ. అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించేలా చేస్తుంది ఈ పరిశ్రమ. ఎంతోమంది పేద కార్మికులకు అన్నం పెడుతుంది ఈ పరిశ్రమ. దాన వీర సూర కర్ణ,అల్లూరి సీతారామరాజు,మేజర్ చంద్రకాంత్,శివ,సమర సింహ రెడ్డి,ఠాగూర్,పోకిరి,గబ్బర్ సింగ్ మరియు ఈగ,బాహుబలి,బహుబలి 2 లాంటి చిత్రాలతో చరిత్ర సృష్టించిన పరిశ్రమ. 2013 లో భారతదేశానికి సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో 17 శాతం వాటాను కలిగి ఉన్న పరిశ్రమ. అంతే కాకుండా భారతదేశంలో ఎక్కువ ప్రేక్షకాదరణ ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు ధీటుగా నిలుస్తూ విజయవంతంగా ముందుకు నడుస్తున్న మనందరి పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ తెలుగు చిత్ర పరిశ్రమను టాలీవుడ్ అని పిలుస్తారు. 


తెలుగు సినిమాలకు పితృ సమానుడిగా రఘపతి వెంకయ్య నాయుడు గారిని కొలుస్తారు. ఈయన 20వ శతాబ్దం మొదట్లో సొంతంగా సినిమాలను తీస్తూ తెలుగు సినిమాలను గురించి తెలియ చేయడానికి ప్రపంచమంతా పర్యటించేవారు. అయితే మొదట్లో అన్ని మూగ సినిమాలు తీసేవారు. హెచ్.ఎమ్.రెడ్డి అనే వ్యక్తి మొదటి తెలుగు-తమిళ్ మోషన్ పిక్చర్ అయిన కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన తెలుగులో మంచి విజయం సాధించిన భక్త ప్రహళ్లాద సినిమాకు దర్శకుడు. సి.ఎన్.ఎన్ ఛానల్ ప్రకటించిన 100 భారతదేశ అద్భుత చిత్రాలలో పాతాళ భైరవి,మల్లీశ్వరి,దేవదాసు,మాయాబజార్,నర్తనశాల మరియు మరోచరిత్ర,మా భూమి,సాగర సంగమం,శంకరాభరణం,శివ సినిమాలు నిలిచాయి. 2017 లో విడుదలైన బాహుబలి2 సినిమా భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. 2018-2019 సంవత్సరాలలో భారతదేశంలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన పరిశ్రమలలో బాలీవుడ్ తర్వాతి స్థానంలో టాలీవుడ్ నిలిచింది. 

20వ శతాబ్దంలో నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు,ఘట్టమనేని కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు,మురళీ మోహన్ లాంటి హీరోల చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించేవి.  

మొదట్లో బ్లాక్ అండ్ వైట్ 35mm సినిమాలు సినిమా థియేటర్లలో విడుదల చేసేవారు. మొదటి తెలుగు సినిమా స్కోప్ చిత్రాన్ని హీరో  కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంతో మన ముందుకు తీసుకొచ్చారు. అంతే కాకుండా మొదటి 75 mm చిత్రాన్ని సింహాసనం చిత్రం ద్వారా హీరో కృష్ణ మన ముందుకు తీసుకు వచ్చారు.అంతేకాకుండా మొదటి డి.టి.ఎస్ చిత్రాన్ని తెలుగు వీర లేవరా సినిమా ద్వారా హీరో కృష్ణ మనకు పరిచయం చేసారు. 

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్,గీత ఆర్ట్స్,వైజయంతి మూవీస్,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,ఆర్కా మీడియా,మైత్రి మూవీస్,యూవీ క్రియేషన్స్,14 రీల్స్ లాంటి సంస్థలు పెద్ద చిత్రాలను నిర్మిస్తున్నాయి. 

చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి హీరోల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తున్నాయి. 

అనుష్క శెట్టి,కాజల్ అగర్వాల్,సమంత,తమన్నా,నయనతార,రష్మిక మందాన,నభా నటాషా,కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అగ్రతారలుగా వెలుగొందుతున్నారు.  
 

18, డిసెంబర్ 2020, శుక్రవారం

ఎనిమిది మెదడులు, మూడు గుండెలు, నీలి రక్తం కలిగిన జీవి.

సముద్రపు జీవి ఆక్టోపస్


సముద్రపు అడుగున ఉంటూ ఎన్నో జీవరాశులను తన చేతులతో పట్టి తినే ప్రమాదకరమైన జీవరాశి ఆక్టోపస్. ఈ ఆక్టోపస్ మూడు గుండెలు, తొమ్మిది మెదడులను కలిగి ఉంటుంది, మరియు దీని యొక్క రక్తం నీలి రంగులో ఉంటుంది. ఆక్టోపస్ యొక్క తొమ్మిది మెదడులలో ఒకటి న్యూరాన్లతో ముడిపడి ఉంటుంది. మరియు మిగతా ఎనిమిది మెదడులు ఎనిమిది చేతులతో అనుసంధానం అయ్యి ఉంటాయి. ఇది శరీరంలో ఎటువంటి ఎముకలు లేని జీవి. ఈ జీవి  ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని తింటుంది. అంతే కాకుండా ఇది సముద్రపు 
జీవరాసులలో తెలివైన జీవరాశిగా పేరు గడించింది. 


ఆక్టోపస్, ఆక్టోపోడా అనే జాతికి చెందిన జీవి. ఈ ఆక్టోపోడా జాతిలో ఇంకా ఇదే తరహాలో 300 జీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆక్టోపస్ అనే పదం గ్రీకు భాష నుండి పుట్టింది. గ్రీకు భాషలో ఆక్టోపస్ అంటే ఎనిమిది అడుగులు అని అర్ధం. ఒక మ్యాగజిన్ వారు ఆక్టోపస్ ను "సముద్రంలో అత్యంత రహస్యమైన జీవిగా పరిగణించారు". ఆక్టోపస్ జాతిలో పసిఫిక్ ఆక్టోపస్ అతిపెద్ద ఆక్టోపస్ గా పేర్కొనబడుతుంది. సాధారణంగా పెద్ద ఆక్టోపస్ బరువు పదిహేను కేజీలు ఉంటుంది. వీటిలోని అతిపెద్ద ఆక్టోపస్ యొక్క బరువు సుమారు 71 కేజీల వరకు ఉంటుంది. ఈ ఆక్టోపస్ కు ఎముకలు లేకపోవడం వల్ల ఇది దీని చేతులను ఎటువైపు కావాలంటే అటువైపు తిప్పగలదు. అంతేకాకుండా ఏ దిశలోనైనా వొంగగలుగుతుంది. దీని చర్మం బాహ్యకణాలు, ఇంద్రియ కణాలతో నిండి ఉంటుంది. 

ఆక్టోపస్ కు మూడు గుండెలు ఉంటాయి. ఒక గుండె రక్తాన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. మరియు మిగతా రెండు గుండెలు మొప్పలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. దీని యొక్క రక్తం నీలి రంగులో ఉండడానికి కారణం హేమోసైనిన్ అనే రాగి ఆధారిత ప్రోటీన్ దీని శరీరంలో ఉండడం. ఆక్టోపస్ ఈత కొట్టినప్పుడు రక్తాన్ని సరఫరా చేసే అవయవం కొట్టుకోవడం ఆగిపోతుంది. అందుకే ఇవి ఈత కొట్టడం కంటే నెమ్మదిగా అటు ఇటు వెళ్ళడానికి ఇష్టపడతాయి. ఆక్టోపస్ లు ప్రపంచ మహా సముద్రాలలో నివసిస్తాయి. ఇవి సముద్రంలోని దిబ్బలు,పగుళ్లలో నివసిస్తాయి. కొన్ని ఆక్టోపస్ సముద్రపు గుహలలో నివసిస్తాయి. 

ఆక్టోపస్ లు ఏకాంతంగా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు  ఇతర ఆక్టోపస్ లతో  కలుస్తాయి. సాధారణంగా ఆక్టోపస్ లు రాత్రిపూట ఆహారం కోసం వేటాడతాయి. కొన్ని సాయంత్రం, మరికొన్ని వేకువజామున వేటాడతాయి. పగటిపూట ఇవి వేటాడవు. 

జీవరాసులు ఏవైనా దీనిపై దాడి చేయడానికి వస్తే ఇది ముందుగానే పసిగడుతుంది. ఆ సమయంలో ఇది ఆ జీవరాశిపై సిరా అనే ద్రావణాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రావణం తాత్కాలికంగా అంధకారున్ని చేయడమే కాకుండా గందరగోళానికి గురిచేస్తుంది. ఒకొక్క సారి ఈ సిరా వల్ల రుచి మరియు వాసన కూడా మందగిస్తుంది. 

ఆక్టోపస్ సహజంగా మాంసాహారి . ఇది ఎక్కువగా చేపలు, సొర చేపలు, ఎండ్రకాయలు, రొయ్యలు  తింటుంది. ఆక్టోపస్ ముందుగా తన శరీరంతో పూర్తిగా తను తినే ఆహారంపై పడుతుంది, అక్కడి నుండి మెల్లగా నోటిలో వేసుకుని తింటుంది. 

15, డిసెంబర్ 2020, మంగళవారం

కోసినప్పుడు కన్నీళ్లు పెట్టించినా తిన్నప్పుడు మాత్రం దీని రుచితో ఔరా అనిపిస్తుంది.

కూరగాయాలకు రారాజు ఉల్లిపాయ


ఎటువంటి వంటలోనైనా ఇది లేకుంటే ఆ వంటకు రుచే వుండదు. ప్రొద్దుటే చేసుకునే టిఫిన్ నుండి సాయంత్రం భోజనం వరకు ఇది లేకుంటే చాలా కష్టం. కూర ఏదైనా సరే దాని రుచిని పెంచడానికి దీనిని వాడవలసిందే. భోజనప్రియులను అకట్టుకోవడానికి దీనిని మన వంటలలో వాడాల్సిందే. ఎన్నో పోషక విలువలు కలిగియున్న ఎంతోమందితో ఔరా అనిపించుకున్న మన వంటింటి నేస్తం ఉల్లిపాయ. 
   

ఉల్లిపాయ యొక్క శాస్త్రీయ నామం ఆలియం సీపా, మరియు ఇది ఆలియేసి కుటుంబంలో ఆలియం ప్రజాతికి చెందినది. ఉల్లిపాయను తెలుగులో ఉల్లిగడ్డ అని కూడా అంటారు. ఉల్లిపాయను ఇంగ్లీషులో ఆనియన్ అని పిలుస్తారు. ఈ ఉల్లిపాయను ఎక్కువగా ప్రతిరోజు వండుకునే వంటలలోను, విందు భోజనాలలోను ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ ఉల్లిపాయలు తెల్ల, ఎర్ర రంగులలో ఉంటాయి. మరియు చిన్న, పెద్ద ఆకారాలలో లభిస్తాయి. అంతేకాకుండా ఎక్కువ వాసన, తక్కువ వాసన మరియు తియ్యగా ఉన్న ఉల్లిపాయలు కూడా మనకు లభిస్తాయి.

ఉల్లిపాయకు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉల్లిపాయ భారతదేశంలో పుట్టింది అని కొందరు అంటే, ఇంకొంత మంది పాకిస్తాన్ లో పుట్టింది అని అంటారు. అయితే మొదట్లో ఆసియా లో మాత్రమే పండే ఈ పంటను ప్రస్తుతం ప్రపంచ నలుమూలలా పండిస్తున్నారు. ఉల్లిలో క్యాలరీ శక్తి ఎక్కువ, వేయిస్తే ఈ శక్తి ఇంకా పెరుగుతుంది. ఉల్లిలో గంధకం పాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని కోసేటప్పుడు కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. అంతేకాకుండా ఉల్లిని ఎక్కువగా తినడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ఉల్లిపాయలతో చేసే కూర చాలా మంచి రుచిని కలిగిఉంటుంది. అంతే కాకుండా ఉల్లిపాయల రసాన్ని తలపై రాయడం ద్వారా జుట్టు ఎదుగుదలను పెంచుకోవచ్చు.  


ఉల్లిపాయల నుండి వచ్చే ఉల్లికాడలు ఎన్నో పోషకవిలువలు కలిగి ఉంటాయి. ఉల్లికాడలను వేడి నీళ్లలో మగ్గించడం ద్వారా వచ్చే రసం మన జీర్ణ వ్యవస్థ ప్రక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు తినని వాళ్ళు ఉల్లికాడలను వారి వంటలలో వినియోగించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఉల్లి కాడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉల్లి కాడలలో విటమిన్ సి, బీటాకెరెటిన్ లు ఉంటాయి ఇవి మన కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడతాయి. గర్భిణీ స్త్రీలు వీటిని తినడం ద్వారా పుట్టబోయే బిడ్డకు వెన్నుముక సమస్యలు తలెత్తకుండా చేయగలుగుతారు. 

28, నవంబర్ 2020, శనివారం

వాట్సాప్,ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపారాలు చేస్తూ విజయం అందుకుంటున్న నేటితరం మహిళలు.

ఆన్ లైన్ వ్యాపారాలలో మహిళా శక్తి


వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలను ఛాటింగ్ చేయడం కోసం, వీడియోస్,  ఫొటోస్ షేర్ చేయడం కోసం మాత్రమే ఈనాటి యువతరం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇటువంటి సామాజిక మాధ్యమాలను ఛాటింగ్ కోసమే కాదు వ్యాపారం చెయ్యడం కోసం ఉపయోగించవచ్చు, గొప్పగా డబ్బులు సంపాదించవచ్చు అని కొంతమంది మహిళలు నిరూపిస్తున్నారు. అలా వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లను ఉపయోగించి వ్యాపారం చేస్తూ ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఈ  మహిళ పేరు  ప్రియాంక శర్మ. ఈమె 90,000 రూపాయల అతి తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టి ఈ రోజు లక్షలలో ఆదాయాన్ని సంపాదిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలిచింది. 


ప్రియాంక శర్మ ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో మాస్టర్స్ అండ్ జర్నలిజం కోర్సులో మాస్టర్ డిగ్రీ అందుకుంది. అయితే ప్రియాంకకు మొదటి నుండి ఫ్యాన్సీ ఐటమ్స్, గోడగడియారాలు, చిన్న చిన్న కళాకృతులు తయారు చేయడంపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే స్ట్రింగ్ నేమ్ ప్లేట్స్, డోర్ హ్యాంగింగ్స్, చెక్కిన బోర్డులు, చెక్క బహుమతులు తయారుచేసేది. అయితే ఒకరోజు ప్రియాంక తను చేసిన వస్తువులను అమ్ముదాం అని తన సోదరి అయిన అంజలితో చెపుతుంది. ఆ మాటలు విన్న ఆమె సోదరి అందుకు అంగీకరిస్తుంది. అలా హారన్ ఓకే ప్లీజ్ అనే పేరుతో ఢిల్లీలో జరిగే ఉత్సవ మేళాలలో తాము చేసిన వస్తువులను అమ్మడం మొదలు పెడతారు. అలా తమ వ్యాపారంలో మొదటి అడుగు వేస్తారు. అయితే ఈ వ్యాపారం చక్కటి విజయం సాధించడంతో తమ వస్తువులను ఆన్ లైన్ లో అమ్మాలని నిర్ణయించుకుంటారు.

 

అలా ఆగస్ట్, 2019వ సంవత్సరంలో  డూడుల్ హట్స్ డిజైన్స్ అనే పేరుతో తమ వస్తువులను ఆన్ లైన్ లో అమ్మడం మొదలు పెడతారు. అందుకోసం వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారు. వీరు అమ్మే వస్తువులు 299 రూపాయల నుండి 3500 రూపాయల వరకు ఉంటాయి. అంతేకాకుండా వీరు తమకు వచ్చిన ఆర్డర్స్ ని భారతదేశంలోని ఏ ప్రాంతంకైనా 4 నుండి 7 రోజులలో డెలివరీ చేస్తారు. 90,000 రూపాయల పెట్టుబడితో మొదలైన ఈ వ్యాపారం అతి తక్కువ రోజులలోనే 3 ఇంతలు ఆదాయాన్ని సంపాదించింది. అంతేకాకుండా వీరు వస్తువులను పోస్ట్ చేసిన 2 గంటలలోనే మొత్తం అమ్ముడైపోతున్నాయి అని ప్రియాంక చెపుతున్నారు.  
 

వ్యాపారం కొంచెం కొంచెం అభివృద్ధి చెందడంతో ఆన్ లైన్ లో ఆర్డర్స్ కూడా పెరిగాయి. ఒకేసారి ఆర్డర్స్ పెరగడం వల్ల ప్యాకింగ్ చేయడం కష్టమయ్యేది. అందుకోసం 8 మంది మహిళా ఉద్యోగులను నియమించుకున్నారు. అలా వారు నియమించుకున్న ఉద్యోగులు  ప్యాకింగ్, ఫాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేసేవారు. అయితే వీరికి ముందుగానే 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగంలో నియమించుకున్నారు. కోవిడ్ -19 లాక్ డౌన్ లో ఆన్ లైన్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరిగిందని తమ వస్తువులు బాగా అమ్ముడుపోయాయని ఆమె అంటున్నారు. 

కళలు మరియు చేతి ఉత్పత్తులు ఆన్ లైన్ లో కొత్త వ్యాపారం కానప్పటికి, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా తాము విజయం సాధించాం అని ఆమె చెబుతున్నారు. అంతేకాకుండా ఇ-కామర్స్ వ్యాపారం ముందు ముందు రోజుల్లో మరింతగా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆమె అన్నారు. 

24, నవంబర్ 2020, మంగళవారం

అనగనగా రాగ మతిశయిల్లుచుండు తినగ తినగ వేము తియ్యనుండు.

 

సకల ఆరోగ్యదాయిని వేప


ప్రకృతి ప్రసాదించిన ఔషధ చెట్లలో వేపచెట్టు ప్రముఖమైనది. ఈ వేపచెట్టు యొక్క భాగాలను ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా వేపపుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. వేప పుల్ల యొక్క రసం శరీరంలోని వ్యర్ధాలను బయటకి పంపించడమే కాకుండా మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. కంటిలో దుమ్ము పడినప్పుడు వేపచుప్ ను కంటిలో వేసి కంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవచ్చు. చర్మసౌందర్యానికి ఉపయోగపడే బ్యూటీ ప్రొడక్ట్స్ లో మరియు సబ్బుల తయారీలో కూడా ఈ వేపను ఉపయోగిస్తారు. 


వేపచెట్టు మహోగాని కుటుంబానికి చెందినది. వేపచెట్టుకు పుట్టిల్లుగా భారతదేశం,బంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ దేశాలు ప్రసిద్ధిచెందాయి. వేపచెట్టును సంస్కృతంలో నీమ్ వృక్షం, అరబిక్ లో నీబ్, కన్నడలో వేపు,తమిళంలో వెప్పం, మలయాళంలో ఆర్య వెప్పు అని పిలుస్తారు. ఆఫ్రికాలో దీన్ని నలభై రకాల రోగాలను నయం చేసే చెట్టుగా భావిస్తారు. 

వేప చెట్టు యొక్క ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. మాములుగా వేపచెట్లు 30 నుండి 40 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయి. వేపు చెట్టుకు కొమ్మలు, ఆకులు ఎక్కువగా ఉంటాయి. వేపచెట్టు యొక్క ఎదుగుదలకు కొమ్మలు ఆకులు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. వేపచెట్టు కొమ్మలకు బెరడ్లు ఉంటాయి. ఆ బెరడు లోపల చెక్క ఉంటుంది. ఆ చెక్కను ఎక్కువగా ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు.  అంతే కాకుండా వేపచెట్టుకు కాసే కాయలను ఔషధాల తయారీలో వినియోగిస్తారు. 

ఆయుర్వేదంలో వేప చెట్టును సర్వరోగనివారిణిగా భావిస్తారు. చరకుడు అనే ఆయుర్వేదవైద్యుడు వేపచెట్టు గురించి ఇలా అన్నాడు. ఎవరైతే పగటి పూట వేపచెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతుకుతారు. తెలుగువారు సాంప్రదాయబద్ధంగా చేసుకునే ఉగాది పండుగలో ఉగాది పచ్చడిలో పులుపు కోసం వేప పువ్వు వినియోగిస్తారు. వేపపుల్లను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేపనూనెను సబ్బులు, షాంపూలు, చర్మ సౌందర్య ఔషధాలలో వినియోగిస్తారు.

చర్మవ్యాధులైన గజ్జి, తామర వచ్చినప్పుడు ఈ వేప ఆకుల గుజ్జును పూతగా పూస్తారు. అమ్మవారు వచ్చినప్పుడు  వేపాకులపై పడుకోబెడతారు. పొట్టలో పురుగులు, మధుమేహం వంటి వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. 


వేపచెట్టు యొక్క ఉపయోగాలు :


1) వేపచెట్టు పువ్వు ను ఉగాది పచ్చడిలో చేదు రుచి కోసం ఉపయోగిస్తారు. 
2) వేప పుల్లను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. 
3) వేపను ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. 
4) వేప చూపును కంటిలోని మలినాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. 
5) అమ్మవారు వచ్చినప్పుడు వేప ఆకులపై పడుకోబెడతారు. 
6) మధుమేహం లాంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. 
7) చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. 
7) వేపను చెక్కను మంచాలు, కుర్చీల తయారీలో ఉపయోగిస్తారు. 

21, నవంబర్ 2020, శనివారం

యోగా చేస్తూ మీ శరీరాన్ని, మనసును ధృడంగా ఉంచుకోండి.

యోగా ఆసనాలు


5000 సంవత్సరాల నుండి భారతదేశ సంస్కృతిలో భాగంగా ఎంతో మందికి శారీరక బలాన్ని, మానసిక సంతృప్తిని కలిగించిన పురాతన పద్ధతి యోగా. ప్రతి రోజు ఉదయం లేవగానే యోగాతో మన రోజును ప్రారంభించడం ద్వారా మనం ఆనందంగా మరియు సంతోషంగా మన పనులను చేసుకోగలుగుతాం. అంతే కాకుండా ఉపిరికి సంబంధించిన శారీరక వ్యాధులనుండి కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. వృద్ధాప్యం ద్వారా వచ్చే ముడతలను ఆలస్యంగా రప్పించడానికి మరియు ముఖం ప్రకాశవంతంగా ఉండడానికి ఈ యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

యోగా మన శరీరంలోని అన్ని అవయవాలని ఉత్తేజపరుస్తూ,వాటి యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. యోగాలో భాగమైన ఉఛ్వాస,నిఛ్వాస ప్రక్రియల ద్వారా మన ఊపిరితిత్తులను,శ్వాసక్రియ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. 

పురాతన యోగాలోని కొన్ని రకాలను గురించి తెలుసుకుందాం. 

1) అష్టాంగ యోగా :


ఈ యోగా విధానం పురాతన యోగా ఆసనాలను మనకు అందిస్తుంది. 1970వ సంవత్సర కాలంలో ఈ యోగా విధానాన్ని ఎక్కువ మంది ఇష్టపడేవారు. ఈ యోగా లోని ఫోజులకు  మన ఊపిరి కేంద్ర బిందువుగా ఉంటుంది. 

2) బిక్రమ్ యోగా :


ఈ యోగా విధానాన్ని హాట్ యోగా అని కూడా అంటారు. ఈ యోగాను 105 డిగ్రీల వేడి మరియు 40 శాతం తేమ ఉన్న గదిలో చేస్తారు. ఈ యోగాలో 26 ఆసనాలు ఉంటాయి. 

3) హత యోగా :


ఈ హత యోగా ఒక శారీరక వ్యాయామ విధానం. కొత్తగా ఎవరైనా యోగా మొదలు పెడితే ఇక్కడి నుండే మొదలు పెడతారు.

4) అయ్యంగార్ యోగా :


యోగా మ్యాట్,దుప్పట,కుర్చీలు,బల్లలపై ఉండి చేసే యోగా,అయ్యంగార్ యోగా. 

5) జీవముక్తి యోగా :


ఈ జీవముక్తి యోగాను జపం,ధ్యానం,ప్రాణాయామం,ఆసనం రూపంలో మనం చేస్తాం. అయితే ఈ యోగాను చేయడం కోసం కొంచెం కఠినంగా కష్టపడాలి. 

6) క్రిపాలు యోగా :


ఈ యోగా విధానం,యోగా శరీరానికి ఎంతగా ఉపయోగపడుతుందో తెలియజేస్తుంది. సాధారణంగా ఈ యోగా శ్వాస,చిన్నపాటి భంగిమలను కలిగి ఉంటుంది. 

7) కుండలిని యోగా :


ఈ కుండలిని యోగా యొక్క ముఖ్య ఉద్దేశం మనలో ఉన్న అంతర్ శక్తిని వెలికితీయడం. 

8) శివానంద యోగా :


ఈ ఆసనం 5 నియమాలపై ఆధారపడి పనిచేస్తుంది. అవి ఊపిరి,విశ్రాంతి,
డైట్,వ్యాయామం మరియు ప్రశాంతమైన ఆలోచనలు. 

9) పవర్ యోగా :


ఈ యోగాను 1980లో కొంత మంది అథ్లెటిక్ అధ్యాపకులు కనిపెట్టారు. అయితే ఈ పవర్ యోగా ప్రధమ ఉద్దేశం శరీర దృఢత్వం. 

18, నవంబర్ 2020, బుధవారం

ఖాదీ పరిశ్రమ గ్రామాల సౌరవ్యవస్థకు సూర్యుడు లాంటిది.

గాంధీ మెచ్చిన ఖాదీ


చేతి మగ్గాలపై సహజమైన ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన వస్త్రాలను ఖాదీ అంటాం. ఈ ఖాదీ పరిశ్రమలు ఎక్కువగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ ఖాదీ వస్త్రాలు భారతదేశ శాంతికి చిహ్నాలుగా ప్రతిష్ట పొందాయి. గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న సమయంలో స్వదేశీ నినాదం ద్వారా మగ్గంపై ఖాదీని తయారు చేసుకుని వాటిని వాడమని భారతదేశ ప్రజలకు విన్నవించాడు. అంతేకాకుండా మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఖాదీ వస్త్రాలను ధరించడం ద్వారా తనకు దేశంపై ఉన్న ప్రేమను, స్వదేశీ నినాదాన్ని మనకు తెలియచేస్తున్నారు. 


ఖాదిని ఖద్దర్ అని కూడా అంటారు. మొదట్లో భారతీయ జెండాలో ఈ ఖాదీ చక్రం ఉండేది. కాలక్రమేణ భారతీయ జెండాలో అశోక చక్రాన్ని ఉంచారు. అయితే 20వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం పనులకు నిరసనగా విదేశీ వస్తువులను కొనకూడని గాంధీ నినాదాన్ని లేవనెత్తారు, దానికి కారణం బ్రిటిష్ ప్రభుత్వం వేరే దేశాల నుండి బట్టలను కొనుక్కొని వచ్చి వాటినే ఇక్కడ వాడాలని ఆజ్ఞాపించేది. అందుకు వ్యతిరేకంగా భారతీయ ఖద్దర్ నే వాడేవారు. అలా భారతదేశంలో ఖాదీ బట్టలు చాలా ప్రాముఖ్యతను పొందాయి. 

ఈ ఖాదీ బట్టలు యొక్క కఠినమైన ఆకృతి చలికాలంలో చలి నుండి మనల్ని రక్షిస్తుంది. వేసవి కాలంలో ఒంటి చెమటను తగ్గించి ఎల్లప్పుడు తాజాగా ఉండేలా చేస్తాయి.

భారతదేశంలో ఈ ఖాదీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, 
తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ ఖాదితో హ్యాండ్లూమ్ చీరలు, ధోతిలు, తువ్వాలలు, చంబా రుమాల్, తుస్సర్ చీరలు తయారుచేస్తారు. ఇండియాలో మన్యవర్ అనే కంపెనీ ఖాదీ వస్తువులను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరు గడించింది.

భారతీయ మాస్టర్ చేనేత డిజైనర్ మరియు పద్మశ్రీ గ్రహీత గజమ్ అంజయ్య,  ఇకాట్ ప్రక్రియ ఆధారంగా ఉత్పత్తులను నేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించారు. 2017వ సంవత్సరానికి  ఖాదీ ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలలో మొత్తం 4,60,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారతదేశంలో 2019 సంవత్సరం నాటికి ఖాదీ వస్తువుల ద్వారా వచ్చే ఆదాయం 3215 కోట్లుగా ఉంది. అయితే భారతప్రభుత్వం ఆ ఆదాయాన్ని 5000 కోట్లకు చేర్చడానికి ప్రయత్నిస్తుంది. 

15, నవంబర్ 2020, ఆదివారం

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకుందాం. శరీరాన్ని బలంగా, ధృఢంగా ఉంచుకుందాం.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు


మనిషి పుట్టుక నుండి మరణం వరకు మనిషి జీవితంలో ప్రముఖ పాత్ర పోషించేది ఆహారం, ఒక మనిషికే కాదు ఈ విశ్వంలో ఉన్న అనేకరకాలైన జంతువులు, కీటకాలు, పక్షుల జీవన మనుగడకు ఈ ఆహారం ఎంతగానో అవసరం. ఇలా మనిషి బ్రతకడానికి ఆధారమైన ఈ ఆహారాన్నిసమయానికి తీసుకోకపోవడం, వేరేవారిమీద కోపంతో తినకపోవడం, ఏది పడితే అది తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం. ఒక ప్రపంచ సంస్థ ఆహారంపై చేసిన పరిశోధనలలో తెలిసిందేంటంటే, ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులు వృధా చేసే ఆహారం ఎన్నో లక్షల మందికి కడుపు నింపుతుందని వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచంలో ముందు ముందు రోజుల్లో దారుణమైన ఆహారపు కొరత వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ తన పరిశోధనల ద్వారా వెల్లడించింది.


మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధార పడి ఉంటుంది. అటువంటి ఆరోగ్యాన్ని అందించే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, విత్తనాలు, చపాతీలు, దంపుడుబియ్యం, మొలకెత్తిన విత్తనాలు మొదలైనవి మంచి పోషకవిలువలు ఉన్న ఆహారపదార్థాలు. 


ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా వచ్చే కొన్ని ఉపయోగాలను తెలుసుకుందాం.


1) మన శరీర బరువును తగ్గించుకోవడంలో ఈ ఆహారపదార్థాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. 

2) కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇవి మనకు సహకరిస్తాయి.
 
3) మధుమేహవ్యాధి ద్వారా వచ్చే చెడు దుష్పరిణామాల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహకరిస్తాయి.
 
4) గుండె సంబంధిత వ్యాధులు మరియు గుండె పోటు లాంటి జబ్బుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కావలసిన శక్తిని మన శరీరానికి అందిస్తాయి.

5) మన ముందు తరాల వారి యొక్క ఆరోగ్యం సక్రమంగా ఉండడం కోసం మనకు ఈ ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 

6) మన శరీరంలోని ఎముకలు, కండరాలు, దంతాలు బలంగా ఉండడం కోసం ఇవి మనకు సహకరిస్తాయి.
 
7) మన మనసు యొక్క ప్రశాంతతను పెంపొందించడంలో ఈ ఆహార పదార్థాలు మనకు ఎంతగానో సహకరిస్తాయి. 

8) మన యొక్క జ్ఞాపక శక్తి పెరుగుదలకు సహకరిస్తాయి. 

9) రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి  సహకరిస్తాయి. 

12, నవంబర్ 2020, గురువారం

ప్రతి వైఫల్యం ఒక మంచి పనికి మొదటి మెట్టు అని గుర్తుంచుకోవాలి.

కల్నల్ సాండర్స్  (కే.ఎఫ్.సి)


జీవితం అంటే ఒక ప్రయాణం. పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనం జీవితం అనే ప్రయాణంలో అలుపెరగని పోరాటాన్ని చేస్తాం. ఈ ప్రయాణంలో మనం ఒక సారి గెలుస్తాం మరొకసారి ఓడిపోతాం. కొంత మంది ఓటమిని అంగీకరించలేక బలన్మరణానికి పాల్పడతారు. మరికొందరు ప్రతి ఓటమి రేపటి గెలుపుకు పునాది అని భావిస్తారు. అలా తన జీవితంలో తను చేస్తున్న ప్రతి పని కూడా అతనిని ఓడిస్తూనే వచ్చింది. ఎన్నో సార్లు బాధతో నిద్రలేని రోజులు గడిపాడు. కొన్ని సార్లు చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు. కాని అటువంటి ఆలోచనలన్నింటి నుండి బయటకు వచ్చి బలమైన ప్రయత్నాన్ని చేస్తూ శక్తిమంతుడిలా నిలబడ్డాడు. అలా ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. అతను మరెవరో కాదు చాలా మందికి ఇష్టమైనఫ్రైడ్ చికెన్ ని తయారుచేసే  కే.ఎఫ్.సి. కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు కల్నల్ సాండర్స్ .

 

బాల్యం మరియు విధ్యాబ్యాసం :


కల్నల్ సాండర్స్ అసలు పేరు హర్లాండ్ డేవిడ్ సాండర్స్. ఇతను 9 సెప్టెంబర్ 1890లో అమెరికాలో ఉన్న ఇండియానా అనే స్టేట్ లోని హెన్రీవిల్లే అనే పట్టణంలో జన్మించాడు. సాండర్స్ విల్బర్ డేవిడ్, మార్గరెట్ అన్ సాండర్స్ అనే దంపతులకు జన్మించాడు. సాండర్స్ చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడం వల్ల ఇంటి భారం మొత్తం తన తల్లిపై పడుతుంది. అలా ఇంట్లోని  పరిస్థితుల వల్ల సాండర్స్ తన సెవెంత్ గ్రేడ్ విద్య పూర్తయిన తర్వాత చదువు మానేస్తాడు.


వ్యక్తిగత విషయాలు : 


సాండర్స్ 1909వ సంవత్సరంలో  జోసెఫిన్ కింగ్ అనే అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు.1947లో సాండర్స్ తన భార్య అయిన జోసెఫిన్ కింగ్ నుండి విడాకులు తీసుకుని విడిపోతాడు. ఆమె నుండి విడాకులు తీసుకున్న తర్వాత క్లాడియా ప్రైస్ అనే ఆవిడను 1949లో వివాహం చేసుకుంటాడు. 


ఉద్యోగాలు మరియు ఆవిష్కరణలు :


1906వ సంవత్సరంలో సాండర్స్  స్ట్రీట్ కార్ అనే కంపెనీలో కండక్టర్ గా పని చేస్తాడు. 
1907వ సంవత్సరంలో సాండర్స్  సథరన్ రైల్వేస్ వర్కుషాపులో హెల్పేర్ గా పని చేస్తాడు. 
1910 వ సంవత్సరంలో సాండర్స్ నార్ఫోక్ అండ్ వెస్ట్రెన్ రైల్వేస్ లో లేబర్ వర్క్ చేస్తాడు. 
1916వ సంవత్సరంలో సాండర్స్ ప్రేడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలో సేల్స్ మాన్ గా చేస్తాడు. 
1922వ సంవత్సరంలో సాండర్స్ ఛాంబర్ అఫ్ కామర్స్ కంపెనీలో సెక్రెటరీ గా పని చేస్తాడు. 
1923వ సంవత్సరంలో సాండర్స్ మిచెలీన్ టైర్ కంపెనీలో సేల్స్ మాన్ గా పని చేస్తాడు. 
1924వ సంవత్సరంలో సాండర్స్ స్టాండర్డ్ ఆయిల్ అఫ్ కెంటకీ కంపెనీలో జనరల్ మేనేజర్ గా పని చేస్తాడు.

1920వ సంవత్సరంలో సాండర్స్ ఫెర్రీ బోట్ అనే కంపెనీని స్థాపిస్తాడు. ఈ కంపెనీ చాలా గొప్ప సక్సెస్ అవుతుంది. అలా చిన్న వయసులోనే కంపెనీ షేర్ హోల్డర్ గా మారతాడు. ఆ కంపెనీలోని షేర్స్ ద్వారా సాండర్స్ కి 22000 ఆదాయం లభిస్తుంది. ఆ డబ్బులతో సాండర్స్ అసిటిలిన్ బల్బ్ అనే కంపెనీని స్థాపిస్తాడు. అయితే ఇది స్థాపించిన కొన్ని రోజులకే దివాళా తీస్తుంది.

కే.ఎఫ్.సి.(కెంటకీ ఫ్రైడ్ చికెన్ ) :


1939లో సాండర్స్ తన దగ్గర ఉన్న డబ్బులతో అశేవిల్లే అనే హోటల్ ని కొంటాడు. తను కొన్న అశేవిల్లే హోటల్లో ఫైర్ ఆక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత తన హోటల్ ని మళ్ళీ బాగుచేయించి 140 సీటర్ రెస్టారెంట్ గా మారుస్తాడు. ఆ హోటల్లో తను తయారు చేసిన సీక్రెట్ రెసిపీ అయిన కెంటకీ ఫ్రైడ్ చికెన్ ని అమ్ముతాడు. అయితే కొన్ని రోజులకు గ్యాస్ కొరత ఏర్పడడంతో ఆ హోటల్ మూసేస్తాడు. అలా దివాళా తీసిన తన వ్యాపారాన్ని 1942లో అమ్మేస్తాడు. అయితే తను తయారు చేసిన కెంటకీ ఫ్రైడ్ చికెన్ ని తన స్పెషల్ రెసిపీ గా భావించేవాడు. అలా 1952లో తన రెసిపీని బయటి హోటల్స్ లో అమ్మడానికి ఫ్రాంచేంజెస్ కోసం వెతుకుతాడు. అలా పెట్ హర్మాన్ అనే రెస్టారంట్ లో తన రెసిపీని అమ్మకానికి పెడతాడు. అయితే అది పెద్ద సక్సెస్ అవుతుంది. అప్పటి నుండి ఫ్రాంచేంజెస్ కోసం ఎన్నో కిలోమీటర్స్ ప్రయాణం చేసి పెద్ద పెద్ద హోటల్స్ లో తన రెసిపీని వాళ్ళ మేనుల్లోకి చేరుస్తాడు. అప్పటి నుండి సాండర్స్ వెనక్కి తిరిగి చుసుకున్నదే లేదు. ఎన్నో పెద్ద పెద్ద రెస్టారెంట్ లు ప్రాంచెంజి కోసం పోటీపడేవి. ఇలా వాళ్ళు అమ్మే ప్రతి చికెన్ పీస్ కి 0.04 డాలర్లను సాండర్స్ కు చెల్లిస్తారు. 1963 నాటికి కే.ఎఫ్.సి కంపెనీ  స్టోర్లు  600కు చేరుకుంటాయి. 1964వ సంవత్సరంలో సాండర్స్ తన కంపెనీని జాన్.వై.బ్రౌన్, జాక్.సి.మెస్సి కి 2 మిలియన్ డాలర్లకు అమ్మేస్తాడు.

మరణం :


సాండర్స్  1980వ సంవత్సరంలో అక్యూట్ లుక్కెమియా అనే రోగంతో మరణించాడు. 

6, నవంబర్ 2020, శుక్రవారం

ఉద్రేకంగా మరియు ధైర్యంగా ఉండండి. ఎల్లప్పుడూ నేర్చుకోవడం కొనసాగించండి. మీరు నేర్చుకోకపోతే ఉపయోగకరమైన పనులు చేయడం మానేస్తారు.

 సత్య నాదెళ్ల 


పెద్దలు ఎప్పుడు ఒక మాట అంటుంటారు. ఇంట గెలిచి కాదు రచ్చ గెలిచి చూడు అని. మన ఇంట్లో నాలుగు గోడల మధ్య మనం గెలిచి గొప్పవాళ్ళం అని అనిపించుకోవడం కాదు, బయట సమాజంలోకి వెళ్లి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ చుట్టూ ఉన్న వాళ్ళతో గొప్పవాడిని అని అనిపించుకోవడం నిజమైన గెలుపు అని అంటారు. చాలా మంది తమని తాము గొప్పవాళ్ళ గాను సమర్థులుగాను చూపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. కాని కొంత మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. అటువంటి వాళ్లలో ప్రముఖంగా చెప్పుకోవలసిన వ్యక్తి, భారతీయుడు, 
మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క ప్రధాన కార్య నిర్వాహక అధికారి సత్య నాదెళ్ల. 

                 

బాల్యం మరియు విధ్యాబ్యాసం :


సత్య నాదెళ్ల అసలు పేరు సత్యనారాయణ నాదెళ్ల. సత్య నాదెళ్ల 19 ఆగష్టు 1967న ఆంధ్రప్రదేశ్ లోని (ఇప్పుడు తెలంగాణా)హైదరాబాద్ నగరంలో జన్మించాడు. ఇతను యుగంధర్, ప్రభావతి అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు. సత్య తన చదువును హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పూర్తిచేసాడు. మరియు మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అనే విద్యా సంస్థలో బ్యాచిలర్ అఫ్ ఇంజనీరింగ్ పట్టాను పొందాడు. సత్య తన మాస్టర్ అఫ్ సైన్స్ డిగ్రీని యూనివర్సిటీ అఫ్ విస్కాన్సిన్ లో పొందాడు. అంతే కాకుండా యూనివర్సిటీ అఫ్ చికాగోలో తన ఎంబీఏ డిగ్రీని కూడా పొందాడు. 


వ్యక్తిగత విషయాలు : 


సత్య 1992లో అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు. సత్య చిన్నప్పటి నుండి క్రికెట్ ని ఎంతగానో ఇష్టపడేవాడు. సత్య ఎక్కువగా ఇండియన్ పోయెట్రీ బుక్స్ , అమెరికన్ పోయెట్రీ బుక్స్ ని చదువుతాడు. సత్య సీతల్ సోకర్స్ క్లబ్ కు ఒక యజమానిగా వ్యవహరిస్తున్నాడు. సత్య హిట్ రిఫ్రెష్ అనే బుక్ ని రాసాడు. ఈ బుక్ ద్వారా వచ్చిన డబ్బులను సేవా కార్యక్రమాలకు దానంగా ఇచ్చేసాడు. 

సత్య మొదట్లో సన్ మైక్రోసిస్టమ్స్ అనే కంపెనీలో పనిచేసేవాడు. 

మైక్రోసాఫ్ట్ :


సత్య 1992వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో పని చేసేవాడు. ఆ తర్వాత సత్య మైక్రోసాఫ్ట్ బిజినెస్ డెవలప్మెంట్ టీంకి వైస్ ప్రెసిడెంట్ గా  వ్యవహరించాడు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ డేటాబేస్, మైక్రోసాఫ్ట్ సర్వర్, డెవలపర్ టూల్స్ యొక్క ఉన్నతిలో ప్రముఖ పాత్ర పోషించాడు. అలా 2011లో 16 బిలియన్ డాలర్లు ఉన్న క్లౌడ్ సర్వీసెస్ ఆదాయాన్ని 20 బిలియన్ డాలర్లకు చేరువయ్యేలా చేసాడు. తద్వారా 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడు. అలా మైక్రోసాఫ్ట్ ను ప్రముఖ దిగ్గజ కంపెనీలకు ఏ మాత్రం తగ్గకుండా బలంగా నిలబెట్టాడు. సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా మోజంగ్, మైన్ క్రాఫ్ట్, క్సమరిన్ లాంటి కంపెనీలను కొని మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసాడు. అంతేకాకుండా లింకేడిన్ కంపెనీని 26 బిలియన్లకు కొని మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసాడు.   

ఇలా మైక్రోసాఫ్ట్ సీఈఓ గా ఎంతో గొప్ప పేరు సంపాదించిన సత్య, సి.ఎన్.బి.సి నిర్వహించిన వ్యాపార దిగ్గజాలకు ఇచ్చే అవార్డుల కార్యక్రమంలో గ్లోబల్ ఇండియన్ బిజినెస్ ఐకాన్ గా నిలిచాడు.

28, అక్టోబర్ 2020, బుధవారం

తన అందంతో ,ఆకృతితో కోట్ల మంది వీక్షకులను కట్టిపడేసిన కట్టడం ఈఫిల్ టవర్.

ఈఫిల్ టవర్


ప్రపంచంలోని అతి పెద్ద కట్టడాలలో ఒకటైన కట్టడం, కోట్ల మందిని తన అందంతో కట్టిపడేసిన కట్టడం, కట్టి ఎన్నో సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా బలంగా నిలబడిన కట్టడం, చరిత్రలో తన కంటూ ఒక ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్న కట్టడం, జీవితంలో ఒకసారైనా చూడాల్సిన కట్టడం ప్యారిస్ లో నిర్మించబడిన ఈఫిల్ టవర్ కట్టడం.


ఈఫిల్ టవర్ చరిత్ర :


ఈ ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ దేశం, ప్యారిస్ నగరంలోని చాంప్ డే మార్స్ లో ఉంది. ఈ ఈఫిల్ టవర్ ని చేత ఇనుప జాలకం తో నిర్మించారు. ఈ ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే 2వ అతి పెద్ద టవర్ గా కీర్తిని గడించింది. 

మారిస్ కొచ్లిన్ మరియు ఎమిలే నౌగియర్ అనే ఇద్దరు డిజైనర్స్  సొసైటీ డి ఎక్స్ప్లోయిటేషన్ డి లా టూర్ ఈఫిల్ అనే కంపెనీలో పని చేసేవారు. ఈ కంపెనీకి బాస్ గుస్తావే ఈఫిల్. వీళ్ళిద్దరూ ఈఫిల్ టవర్ యొక్క డిజైనును రూపొందించారు. డిజైన్ పూర్తయిన వెంటనే ఆ ఇద్దరు డిజైనర్స్ ఆ డిజైన్ ను తమ బాస్ అయిన ఈఫిల్ కి చూపిస్తారు, ఆ డిజైన్ చూసిన ఈఫిల్ కొన్ని మార్పులను చేయమంటాడు. అప్పుడు డిజైనర్స్ ఇద్దరు స్టీఫెన్ సౌవేస్టర్ తో కలిసి బేస్ డిజైన్, డెకరేషన్స్ చేసి పూర్తి డిజైన్ ని ఈఫిల్ కి చూపించి ఆమోదాన్ని పొందుతారు. అసలు ఈ టవర్ కట్టడానికి ప్రధాన కారకుడు ఈఫిల్. ఈఫిల్ న్యూ యార్క్ లో ఉన్నలాటింగ్ అబ్జర్వేటరీ కట్టడాన్ని ప్రేరణగా తీసుకుని దీన్ని నిర్మించాలని అనుకున్నాడు.

ఈఫిల్ ఆమోదాన్ని పొందిన ఈ టవర్ యొక్క ఎత్తు 300 మీటర్లుగా నిర్దారిస్తారు. అయితే మొదట్లో 300 మీటర్ల ఎత్తు గల భవనం యొక్క నిర్మాణం సాధ్యం కాదని అందరూ అనేవారు, కొంతమంది నేరుగానే టవర్ ని నిర్మించాలనుకున్న ఈఫిల్ ని విమర్శించేవారు. కాని ఈఫిల్ వాటిని లెక్క చేయలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద టవర్ ని నిర్మించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనుకున్నదే తడువుగా ప్రణాళికలను రూపొందించి పనులను చకచకా ముందుకు నడిపించాడు. అయితే ఈ టవర్ యొక్క డిజైన్ నాలుగు వేరువేరు లాటిస్ గిర్డర్ స్థంబాలపై నిలబడి చివర్లో కలిసినట్టుగా ఉండేలా రూపొందించారు.

ఈఫిల్ ఈ డిజైన్ కి ఆమోదాన్ని పొందడమే కాకుండా దీన్ని ఆర్ట్స్ డిజైన్ ఎక్సిబిషన్ లో ప్రదర్శిస్తాడు. అలా మార్చి 30, 1885 న, ఈఫిల్ తన ప్రణాళికలను సొసైటీ డెస్ ఇంజినియర్స్ సివిల్స్‌కు సమర్పిస్తాడు. సాంకేతిక సమస్యలను చర్చించిన తరువాత మరియు టవర్ యొక్క ఆచరణాత్మక ఉపయోగాలను నొక్కిచెప్పిన తరువాత, టవర్ ప్రతీకను గురించి చెప్పి తన ప్రసంగాన్ని ముగిస్తాడు. అలా ఎన్నో ఆమోదాలు పొందిన తర్వాత 28 జనవరి 1887లో ఈ ఈఫిల్ టవర్ కట్టడాన్ని నిర్మించడం మొదలు పెడతారు. 2 సంవత్సరాల పాటు అలుపెరగని నిర్మాణాన్ని జరిపి చివరకు 15 మార్చి 1889లో టవర్ యొక్క నిర్మాణం పూర్తి చేస్తారు. 31 మార్చి 1889లో ఈ ఈఫిల్ టవర్ ని ప్రారంభించారు. ఈఫిల్ టవర్ పై ఏర్పరచిన టిప్ తో కలిసి ఈ టవర్ యొక్క మొత్తం పొడవు 324 మీటర్లుగా నిర్దారించారు.

ఈ టవర్ సందర్శకుల సౌకర్యార్ధం కోసం మూడు స్థాయిలుగా విభజించబడింది. మొదటి స్థాయికి రెండవ స్థాయికి వెళ్ళడానికి మెట్ల సౌకర్యం ఉంది. మొదటి రెండు స్థాయిలలో రెస్టారెంట్స్ ఉంటాయి. మూడవ స్థాయికి వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నాయి కాని ఎక్కువ దూరం కావడం వల్ల సందర్శకులు లిఫ్ట్ లోనే వెళ్తారు. భూమి నుండి మూడవ స్థాయికి ఈ టవర్ ఎత్తు 276 మీటర్లుగా ఉంది.

2015వ సంవత్సరంలో డబ్బులు కట్టి సందర్శించే కట్టడాల్లో 69 లక్షల మంది సందర్శించిన 
అద్భుత కట్టడంగా చరిత్రలో నిలిచింది.

13, అక్టోబర్ 2020, మంగళవారం

వూహన్ ప్రభుత్వ ప్రయోగ శాలలో నోవల్ కరోనా వైరస్ అభివృద్ధి చెందిందని చైనా వైరాలజిస్ట్ అంటున్నారు.

చైనాలో పుట్టిన నోవల్ కరోనా వైరస్


ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసేసింది, ఎంతోమంది ఆకలి చావులకు కారణమయ్యింది, ఎన్నో దేశాల ఆర్ధిక వ్యవస్థలకు తీరని నష్టాలను కలిగించింది, మరెంతో మందిని ప్రాణాలు కోల్పోయేలా చేసింది, అతి తక్కువ రోజులలో ఇదంతా చేసింది, ఇలా ఇదంతా చేసింది, ఈనాటీ  పరిస్థితులకు కారణం అయ్యింది ఒకే ఒక్క వైరస్, ప్రపంచమంతటా వ్యాపించి ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్. 

విషయానికి వస్తే ఈ కరోనా వైరస్ చైనాలోని లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్ నుండి పుట్టిందని అక్కడి నుండి చైనాకు మరియు ఇతర దేశాలకు వ్యాపించిందని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం మొదటి నుండి చెప్పుకొస్తోంది. అయితే ఈ కరోనా వైరస్ చైనాలోని లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్లో పుట్టలేదని వూహన్ వైరాలజీ ల్యాబ్ లో పుట్టిందని చైనా వైరాలజిస్ట్ చెబుతున్నారు. 



డాక్టర్, వైరాలజిస్ట్ అయిన  లీ మాంగ్ యాన్ అనే మహిళ కరోనా వైరస్ చైనాలో పుట్టిందని మీడియాకు వివరించింది. అయితే ఈమె హాంగ్ కాంగ్ స్కూల్ అఫ్ పబ్లిక్ హెల్త్ యూనివర్సిటీలో ప్రపంచ ప్రమాద వ్యాధుల నిపుణురాలిగా పని చేసేవారు. అక్కడినుండి చైనాలోని వూహన్ లో కొత్తగా వచ్చిన  లుకేమియా వ్యాధి పై రహస్య పరిశోధనలు చేయడానికి వెళ్లిన వాళ్లలో ఈమె ఒకరు. ఈమె డిసెంబర్, 2019 మరియు జనవరి, 2020 లో చేసిన పరిశోధనల ఫలితాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ సూపర్ వైజర్ కి వెల్లడిస్తుంది. అయితే అతను పట్టించుకోడు, మరియు ఆమెకు ఈ వైరస్ గురించి పట్టించుకోవద్దని ఒక వేళ దీని గురించి ఎవరితోనైనా చెబితే నువ్వు బ్రతికి ఉండవు అని ఆమెకు చెబుతాడు. అయితే ఈ రోగం ముందు ముందు రోజుల్లో ప్రమాదకారిగా మారొచ్చని దీని గురించి ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో చైనాలోని లూథర్ అనే వ్యక్తిని కలుస్తుంది. ఆయనతో తన పరిశోధనల ద్వారా కనిపెట్టిన 5 ఫలితాలను అతనికి తెలియజేస్తుంది.

1) కోవిడ్ -19 వైరస్ ని చైనా ప్రభుత్వం కనిపెట్టింది. 
2) ఇది ఒక మనిషి నుండి ఇంకో మనిషికి అంటుకునే వ్యాధి. 
3) ఇది ముందు ముందు రోజుల్లో అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. 
4) ఈ వైరస్ చైనా లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్ నుండి రావడం నిజం కాదు. 
5) ఇది ప్రకృతి నుండి వచ్చిన వైరస్ కాదు చైనాలోని వుహాన్ ల్యాబ్ లో సి.సి.45,జె.ఎక్స్.ఈ.21 అనే చెడ్డ కరోనా కణాలతో తయారు చేయబడిన వైరస్, ఈ వైరస్ లో చిన్న చిన్న మార్పులు చేసి చివరకు నోవల్ కరోనా వైరస్ గా రూపుదిద్దారు. 

అయితే ఈ వైరస్ చైనాలోని ల్యాబ్ లో పుట్టిందనడానికి చైనా శాస్త్రవేత్తల అధ్యయనం, హంగ్ కాంగ్ నిపుణుల అధ్యయనం మనకు ఆధారాలుగా నిలుస్తాయి అని ఆమె చెబుతుంది. అయితే ఈ వైరస్ చైనాలోని లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్లోని సీ ఫుడ్స్ కణాల నుండి రాలేదని ఈ వైరస్ మనిషి యొక్క కణాల నుండి పుట్టిందని, యూ.ఎస్ లోని శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేస్తున్నారని మరికొన్ని రోజుల్లో తమ పరిశోధనల ఫలితాలను ఒక బుక్ లో ప్రచురించి ప్రపంచానికి కరోనా వైరస్ యొక్క నిజాన్ని  తెలిసేలా చేస్తామని ఆమె తెలియచేసారు. అంతే కాకుండా ఈ బుక్ ను చూస్తే ఎటువంటి బయాలజీ నాలెడ్జి లేకపోయినా సరే ఈ వైరస్ మనిషి కణాలతో తయారుచేశారని సులువుగా తెలుస్తుందని ఆమె తెలియ చేసారు. 

10, అక్టోబర్ 2020, శనివారం

12 సంవత్సరాల క్రితం మరణించిన బాలిక ఈ రోజు గృహిణిగా సజీవంగా ఉంది.

నమ్మ లేని నిజం


12 సంవత్సరాల క్రితం చనిపోయింది అన్న అమ్మాయి ఈ రోజు బ్రతికే ఉంది. అయితే ఆ అమ్మాయి హత్య కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించబడ్డ  6 మంది వ్యక్తులకు జైలు శిక్ష కూడా పడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 


2008వ సంవత్సరంలో తన కూతురు కనిపించడం లేదని ఆమె తల్లి కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తుండగా కాన్పూర్ జిల్లాలోని ఘతంపూర్ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ శవం లభ్యమవగా, ఆ శవాన్ని చుసిన బాధితురాలి తల్లి తన కూతురని నిర్దారిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా 6 మంది యువకులను కస్టడీలోకి తీసుకుంటారు. కేసు వివరాలను తెలుసుకునే క్రమంలో ఒక నిందితుడు మరణించగా మిగిలిన ఐదుగురు బెయిల్ మీద విడుదలయ్యారు. 

అయితే ఈ కేసులో చనిపోయిందని నిర్దారించబడిన మహిళ బ్రతికి ఉందని చెప్పిన స్థానిక రాజకీయ నాయకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను కలుస్తారు. అయితే ఆమె 26 ఏళ్ళ వయసు ఉన్న ఒక ఇంటి గృహిణిగా కనిపిస్తుంది. వెంటనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అయితే అసలు ఏమి జరిగింది ఆమె ఎలా బ్రతికి ఉంది అనే విషయాలు తెలియవలిసి ఉండగా కేసును పోలీసులు సీబీసీఐడీ కి అప్పగించారు. 

7, అక్టోబర్ 2020, బుధవారం

ఆపిల్ సంస్థ తమ మొట్టమొదటి ఆన్ లైన్ ఈ కామర్స్ స్టోర్ ని ఇండియాలో ప్రారంభిస్తోంది.

ఆపిల్ ఇండియన్ ఆన్ లైన్ స్టోర్


ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఎన్నో దేశాలలో తమ వస్తువులను అమ్ముతూ తమ సంస్థకు ఒక ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్న కంపెనీ ఆపిల్. అమెరికాలో మొదలైన చిన్న కంపెనీ ఈ రోజు ప్రపంచం మెచ్చుకోదగ్గ టెక్ కంపెనీ లలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇప్పటి వరకు ఆపిల్ తమ వస్తువులను ఇండియా లోని రిటైల్ స్టోర్స్ లోను,అమెజాన్,ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో మాత్రమే విక్రయించేది. అయితే ఇప్పుడు ఆపిల్ భారతదేశంలో తమ వస్తువులను నేరుగా తమ వెబ్ సైట్స్ లో అమ్మడానికి సిద్ధమైంది. అందుకోసం ఆపిల్ తన ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్ ని భారతదేశంలో ప్రారంభించింది. ఇలా ఆన్ లైన్ లో తమ వస్తువులను అమ్మడం ద్వారా  మరింత డిమాండ్ ను మరియు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆపిల్ ప్రయత్నిస్తోంది. 


ఈ ఆపిల్ ఆన్ లైన్ స్టోర్స్ లో అన్ని రకాలైన ఆపిల్ ఉత్పత్తులు ఐఫోన్,మ్యాక్,ఐపోడ్ టచ్,ఐపాడ్,వాచ్,టీవీ,ఎయిర్ పోడ్స్,మ్యూజిక్,హోమ్ పోడ్,యాక్సెసరీస్ అమ్ముతున్నారు. అంతే కాకుండా ఆపిల్ సర్వీసెస్ అయిన ఆపిల్ మ్యూజిక్,ఆపిల్ టీవీ ప్లస్,ఆపిల్ ఆర్కేడ్,ఐ క్లౌడ్,ఆపిల్ వన్,ఆపిల్ బుక్స్ ను అందుబాటులోకి తెచ్చారు.అంతే కాకుండా మనకు నచ్చిన ఐఫోన్ యొక్క కాన్ఫిగరేషన్,స్టోరేజ్ కెపాసిటీ,ర్యామ్ వంటి విషయాలను పూర్తిగా చుసిన తర్వాత మనం ఐఫోన్ ను ఆర్డర్ చేయవచ్చు.  

ఈ ఆన్ లైన్ స్టోర్ 23,సెప్టెంబర్,2020 నుండి భారతదేశంలో అందుబాటులోకి వస్తుంది. 

ఆపిల్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ :


ఈ ఆపిల్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ద్వారా మన పాత ఆపిల్ మొబైల్ ఫోన్ ని ఇవ్వడం ద్వారా కొత్త ఆపిల్ మొబైల్ ఫోన్ ని తీసుకునే సదుపాయాన్ని ఆపిల్ సంస్థ మనకు కల్పిస్తుంది. ఇందుకోసం మనం ఆపిల్ ఆన్ స్టోర్ లో మన పాత ఐఫోన్ యొక్క సమాచారాన్ని తెలియచేయవలసి ఉంటుంది. అలా ఆపిల్ అడిగిన పూర్తి ప్రశ్నలకు సమాధానాలు తెలిపిన తర్వాత మనం ఆర్డర్ చేసే కొత్త మొబైల్ ఫోన్ ప్రైస్ మనకు తెలుస్తుంది.క్రెడిట్ కార్డ్స్ పై నెలవారీ డబ్బు చెల్లింపుల సదుపాయం కూడా ఆపిల్ మనకు కల్పిస్తుంది. 

ఆపిల్ కేర్ ప్లస్ (+):


మీరు ఆపిల్ ఐఫోన్లను కొనుక్కుంటే మీకు కంపెనీ ద్వారా వారెంటీ అనేది వస్తుంది. అయితే ఈ కంపెనీ వారెంటీ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. అయితే  ఆపిల్ మన ముందుకు తీసుకు వచ్చిన ఆపిల్ కేర్ ప్లస్ ద్వారా మన మొబైల్ తో పాటు వచ్చిన 1 సంవత్సరం వారెంటీతో పాటు మరో రెండు సంవత్సరాలు వారెంటీ మనకు లభిస్తుంది. అయితే ఈ వారెంటీలో కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

మొదటగా ఈ ఆపిల్ కేర్ ప్లస్ సదుపాయాన్ని పొందాలంటే మీరు ఆపిల్ ప్రోడక్ట్  కొని 60 రోజులు మించకూడదు. ఆపిల్ ప్రోడక్ట్ కొన్న 60 రోజులలోపు మాత్రమే మీరు ఈ సదుపాయాన్ని  పొందగలరు. ఇంకా ఈ సదుపాయాన్ని పొందడానికి మీరు మీ కొత్త ఆపిల్ మొబైల్ ఫోన్ నుండే రిజిస్టర్ అవ్వొచ్చు. లేదంటే 0008001009009 కు డయల్ చేయడం ద్వారా కూడా మీరు ఈ సదుపాయాన్ని పొందగలరు. అయితే నెంబర్ డయల్ చేయడం ద్వారా ఈ  సదుపాయాన్ని పొందడం కోసం మీరు మొబైల్ కొన్న పేమెంట్ స్లిప్ ను సమర్పించవలసి ఉంటుంది. 

ఈ ఆపిల్ కేర్ ప్లస్ సదుపాయాన్ని ఆక్టివేట్ చేసుకోవడం ద్వారా సాఫ్ట్ వేర్ సమస్యలైనా ఐఫోన్,ఐ.ఓ.ఎస్,ఆపిల్ బ్రాండెడ్ యాప్స్ లో ఏమైనా సమస్యలు తలెత్తితే ఆపిల్ ప్రతినిధులు ఇచ్చే సలహాలు సూచనలతో మన ఆపిల్ డివైస్ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
  
అంతేకాకుండా మన ఆపిల్ డివైస్ లో ఏమైనా హార్డ్ వేర్ సమస్యలు తలెత్తితే రిపేర్ మరియు ప్రోడక్ట్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే స్క్రీన్ డామేజ్ గాని మరేయితర డామేజ్ అయినా సంవత్సరంలో 2 సార్లు మాత్రమే చూస్తారు. అంటే మొత్తం రెండు సంవత్సరాల వారెంటీ లో 4 సార్లు డామేజ్ ప్రొటెక్షన్ కవర్ మనకు లభిస్తుంది. అయితే స్క్రీన్ డామేజ్ కి  సర్వీస్ ఛార్జ్ 2500 రూపాయలు తీసుకుంటారు. మరేయితర డామేజ్ అయిన గాని 8900 రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు.  

4, అక్టోబర్ 2020, ఆదివారం

SAMSUNG GALAXY - M51 ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యొక్క విశ్లేషణ.


SAMSUNG  GALAXY - M51


ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ లోని దిగ్గజ కంపెనీలలో ఒకటైన శాంసంగ్ కంపెనీ తన కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ -ఎమ్ 51 ని మార్కెట్లోకి తీసుకొచ్చింది . మనం ఇప్పుడు ఈ మొబైల్ యొక్క పనితీరు మరియు ఈ మొబైల్ లోని విశిష్టతలను గూర్చి తెలుసుకుందాం. ఇప్పటి వరకు వచ్చిన శాంసంగ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ కంటే భిన్నముగా ఇది 7000MAH బ్యాటరీ తో మనముందుకు వస్తుంది. 


ఈ శాంసంగ్ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ 7000 mAh. ఛార్జింగ్ ఫుల్ అవడానికి 2 గంటలు పడుతుంది అంతేకాకుండా 2 రోజులు పాటు నడుస్తుంది.
ఈ మొబైల్ యొక్క డిస్ప్లే 6.70 అంగుళాల స్క్రీన్ మరియు గొర్రిలా గ్లాస్,టచ్ స్క్రీన్ .
ఈ మొబైల్ మనకు రెండు కలర్స్ లో లభిస్తుంది. ఒకటి ఎలక్ట్రిక్ బ్లూ,రెండవది సెలెస్టియల్ బ్లాక్.
ఈ మొబైల్ 6gb ram,128gb స్టోరేజ్ మరియు 8gb ram,128gb స్టోరేజీలలో లభిస్తుంది. అంతే కాకుండా దీని యొక్క స్టోరేజీ ను 512gb వరకు విస్తరించుకోవచ్చు. 
కెమెరా విషయానికి వస్తే దీనియొక్క ప్రాధమిక కెమెరా 64 మెగా పిక్సల్, రెండవ కెమెరా 12 మెగా పిక్సల్ గా ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్ లో మెక్రో సెన్సార్,డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 
ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ soc తో నిర్మితమైన మొట్టమొదటి శాంసంగ్ మొబైల్ ఫోన్. 
ఈ మొబైల్ లో రెండు నానో సిమ్ స్లాట్స్  మరియు ఒక డెడికేటెడ్ మెమొరీ కార్డ్ స్లాట్ ఉన్నాయి. 
ఈ మొబైల్ బరువు 213 గ్రామ్స్ . 



ఈ మొబైల్ యొక్క స్క్రీన్ 6.7 అంగుళాలు,ఇది గేమింగ్ కు,వీడియోస్ చూడడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. 
ఈ మొబైల్ లోని క్వాల్కమ్ ప్రాసెసర్ గేమింగ్ కు,యాప్స్ డౌన్లోడ్స్  కు,స్లో అవడం లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి సహకరిస్తుంది. 
6gb,8gb ram సిస్టమ్స్ ఫోన్ ని హ్యాంగ్ కాకుండా చేస్తాయి. 
ఈ మొబైల్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేయబడింది. 
ఈ మొబైల్ చూడడానికి చాలా స్లిమ్ గా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 

ఈ శాంసంగ్ గెలాక్సీ -ఎమ్ 51 మొబైల్ అమెజాన్ మరియు శాంసంగ్ స్టోర్స్ లో మనకు అందుబాటులోకి వచ్చాయి. 

సెప్టెంబర్ 22,2020 కు 6gb ram,128 internal storage  మొబైల్ ఫోన్ ఖరీదు 24,999 గా ఉంది. 
మరియు 8gb ram ,128gb internal storage మొబైల్ ఫోన్ ఖరీదు 26,999 గా ఉంది.  

1, అక్టోబర్ 2020, గురువారం

వాల్ మార్ట్ మరియు టాటా గ్రూప్ కంపెనీల కలయిక ద్వారా సూపర్ యాప్.

టాటా-వాల్ మార్ట్ భారీ ఒప్పందం.


భారతదేశంలోని దిగ్గజ కంపెనీలలో ఒకటైన టాటా సంస్థ, తన రిటైల్ వ్యాపారాలను ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్  పైకి తీసుకు రావడానికి  సిద్ధమైంది. అందుకోసం అవసరమైన వెబ్ సైట్ ని, యాప్ ను రూపొందిస్తోంది. ఆ యాప్ పేరు సూపర్ యాప్. ఈ యాప్ లో టాటా సంస్థ తయారుచేసిన అన్ని ఉత్పత్తులను నిక్షిప్తపరుస్తారు. తద్వారా వినియోగదారులు ఇంటి వద్ద నుండే సులువుగా టాటా వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఫ్లిప్ కార్ట్ లో 66 శాతం వాటాను కలిగి ఉన్న వాల్ మార్ట్ సంస్థ, ఈ సూపర్ యాప్ లో 26 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టడానికి ముందుకొచ్చిందని, తద్వారా ఈ సూపర్ యాప్ లో అత్యధిక వాటాదారుగా నిలవబోతోందని సమాచారం.
 


భారతదేశంలో టాటా అనే పేరు తెలియనివారు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సంస్థ తయారుచేయని ఉత్పాదన అంటూ లేదు కాబట్టి. మనం రోజు కూరల్లో వేసుకునే ఉప్పు నుండి ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునే బంగారం దాకా అన్ని రంగాలలోను తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే టాటా సంస్థ ద్వారా వచ్చిన ఉత్పత్తులన్ని ఎక్కువగా రిటైల్ స్టోర్స్ లో అమ్మడం మనం చూస్తున్నాం, అయితే కరోనా లాక్ డౌన్ టైమ్ లో  ఎక్కువ మంది ఇంటిదగ్గర నుండే వస్తువులను కొనడం వల్ల ఈ సంస్థ రిటైల్ వ్యాపారంలో కొంచెం నష్టాలను చూడవలసి వచ్చింది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టాటా సంస్థ సూపర్ యాప్ అనే యాప్ ద్వారా ఆన్ లైన్ వ్యాపారాన్ని మొదలు పెట్టింది. 

ఈ యాప్ ద్వారా టాటా సంస్థ, హెల్త్ కేర్, ఆహారం, కిరాణా సేవలు, భీమా, ఆర్ధిక సేవలు, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్, బిల్ పేమెంట్స్  లాంటి అన్నిసేవలను ఒకే ఛానల్ పైకి తీసుకొస్తోంది. అయితే ఈ సూపర్ యాప్ డిసెంబర్ లేదా జనవరి లో ప్రారంభమవ్వొచ్చని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఇప్పటికే  వెల్లడించారు. సుమారుగా 50 - 60 బిలియన్ డాలర్ల పెట్టుబడితో మొదలవుతున్న ఈ సూపర్ యాప్ లో అమెరికా సంస్థ వాల్ మార్ట్ 26 బిలియన్ డాలర్ల  పెట్టుబడి పెట్టనుంది. తద్వారా వాల్ మార్ట్, సూపర్ యాప్ వ్యాపారంలో అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. ఈ లావాదేవీ కోసం వాల్ మార్ట్  గోల్డ్ మాన్ సాచ్స్ ఇన్వెస్టర్ బ్యాంకు ను తమ ఇన్వెస్టర్ బ్యాంకు గా నియమించుకున్నట్టు సమాచారం.   

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...